Land Scam Case: ముడా కుంభకోణంలో ఏం జరుగుతోంది? ఛైర్మన్ రాజీనామా చేసిన రెండురోజులకే ఈడీ రంగంలోకి దిగిందా? సోదాల వెనుక ఏం జరుగుతోంది? కమిషనర్తో ఈడీ అధికారులు ఏం మాట్లాడారు? ఇలా రకరకాల ప్రశ్నలు కన్నడ వాసులను వెంటాడుతోంది.
కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ ముడా కుంభకోణంపై ఈడీ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లేటెస్ట్గా మైసూర్ నగరాభివృద్ధి సంస్థలో ఈడీ సోదాలు చేయడం కలకం రేపుతోంది.
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆఫీసుకు చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు చేశారు. తొలుత ముడా కమిషనర్ రఘనందన్ సహా ఇతర అధికారులతో మాట్లాడారు. లభించిన పత్రాల ఆధారంగా సిబ్బందిని విచారించే అవకాశమున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో సీఎం సిద్ధరామయ్యకు కష్టాలు తప్పవని అంటున్నారు.
రెండు రోజుల కిందట ముడా అథారిటీ ఛైర్మన్ మరిగౌడ్ రాజీనామా చేశారు. కాకపోతే అనారోగ్యం కారణంగా రిజైన్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్యకు మరిగౌడ అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. అయితే ఈ స్కామ్లో సీఎం సిద్ధరామయ్యతోపాటు మరిగౌడ ప్రమేయమున్నట్లు ఓ వైపు కర్ణాటకలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ALSO READ: కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు
మరోవైపు ముడా భూముల కుంభకోణంలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య భార్య ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములను ముడాకు తిరిగి ఇచ్చేశారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కన్నడ రాజకీయ నేతలు సీఎం సిద్దరామయ్యకు కష్టాలు తప్పవని అంటున్నారు.