Bihar Hooch | కల్తీ సారా తాగడంతో బిహార్ లో చనిపోయిన వారి సంఖ్య 43 కు పెరిగింది. మంగళవారం, అక్టోబర్ 15, 2024న కల్తీ మద్యం సేవించిన 6 మంది చనిపోయారని జాతీయ మీడియా తెలిపింది. అయితే మరణించేవారి సంఖ్య రోజురోజుకీ పెరిపోతోంది. ఇంకా ఆస్పత్రితో 73 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో చాలామంది కంటిచూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
అయితే మరణించిన 43 మందిలో ఎక్కువగా సివాన్, సారన్ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ. చనిపోయిన 43 మందిలో 30 మంది సివాన్ జిల్లాకు చెందినవారు కాగా, 11 మంది సారన్ జిల్లాకు చెందిన వారు. మరో ఇద్దరు గోపాల్ గంజ్ జిల్లా నివాసులు.
కల్తీ మద్యం కారణంగా మరణాలు జరుగుతుండడంతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు.గురువారం సాయంత్రం సిఎం నితీశ్ కుమార్ కల్తీ మద్యం కేసులో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి.. ఒక అదనపు డిజిపి ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో విచారణ జరిపించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి మద్యపాన నిషేధం అమలుకావాలని కఠినంగా చెప్పారు. ప్రజలు మద్యం తాగకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు.
సివాన్ పోలీసులు ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయగా.. సారన్ జిల్లా పోలీసులు 37 మందిని అరెస్టు చేశారు. సివాన్ జిల్లాకు చెందిన ఒక పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. 2022లో కూడా ఇలాగే సారన్, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం కారణంగా 73 మంది చనిపోయారు. ఇప్పుడు అలాగే జరుగుతోంది. ఆ కేసుతో ఇప్పటి ఘటనలు ముడిపడి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తాగిన వారంతా ఒకేరకమైన మద్యం సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని వెల్లడించారు. గత నాలుగు రోజుల్లో సివాన్, సారన్ జిల్లాల్లో పోలీసులు 2000 లీటర్లకు పైగా అక్రమ మద్యం సీజ్ చేశారు.
Also Read: ’90 గంటలు బాత్ రూమ్ లో బంధించారు’.. ఉగాండాలో భారత బిలియనీర్ కూతురు ‘కిడ్నాప్’
దీంతో పాటు సారన్ జిల్లాలో ఒక ప్రత్యేక విచారణ బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) కల్తీ మద్యం కేసులో విచారణ ప్రారంభించింది. సారన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేశామని, కేసులో దోషులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు బిహార్ లో కల్తీ మద్యం కేసుకి రాజకీయ రంగుపులుముకుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం మద్యపాన నిషేధం విధించినా దాని ప్రభావం అసలు కనిపించడం లేదని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాష్ట్రీయ జనతా దల్ నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో మద్యపాన నిషేధం నామమాత్రంగా ఉంది. విషపూరిత కల్తీ సారా కారణంగా 30 మందికి పైగా చనిపోయారు. చాలా మంది కంటిచూపు పోగొట్టుకున్నారు. ఇది చాలా పెద్ద ఘటన, కానీ మన గౌరవ ప్రధాన మంత్రి మాత్రం బాధితులను పరామర్శించేందుకు ఒక్క మాట కూడా అనలేదు. ” అని మండిపడ్డారు.
బిహార్ రాష్ట్రంలో 2016 నుంచి మద్యపాన నిషేధం కొనసాగుతోంది. తాజాగా కల్తీ మద్యం కేసులో దోషులకు కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం చెబుతోంది.