Dubbaka: దుబ్బాకలో రాజకీయ దుమ్ము చెలరేగింది. బస్టాండ్, గోడౌన్ ఓపెనింగ్ సందర్భంగా రచ్చ రచ్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఆందోళన, తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత రాజుకుంది. ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుచరులు జై బీజేపీ నినాదాలతో హోరెత్తించగా.. జై బీఆర్ఎస్ అంటూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫాలోయర్స్ రెచ్చిపోయారు. పోలీసులు అతికష్టం మీద ఇరు వర్గాలను కంట్రోల్ చేశారు.
కొన్నిరోజులుగా దుబ్బాకలో పరస్పర సవాళ్లతో అగ్గి రాజుకుంది. ఆ సెగ ఇప్పుడు ఎగిసిపడింది. బస్టాండ్, గోడౌన్ నిర్మించింది తామంటే తామంటూ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య మాటలకు మాట నడిచింది. అలా పొలిటికల్ హీట్ చెలరేగగా.. శుక్రవారం ప్రారంభోత్సవాల సందర్భంగా ఇరు పార్టీ కార్యకర్తలు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. గొడవకు కారణమైన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బానే ఉన్నారు. వారి సమక్షంలోనే కార్యకర్తలు తన్నుకున్నారు. బస్టాండ్ ఓపెనింగ్ లో మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం కలిసే ఉన్నారు. వారంతా కలిసే ప్రారంభోత్సవాలు చేశారు. అంతా కలిసి ఫోటోలు దిగారు. కలిసిమెలిసే ఉన్నారు.
నేతలంతా బానే ఉన్నారు. కార్యకర్తలే రెచ్చిపోయారు. ఇటు మంత్రి హారీష్ రావు వారిస్తున్నా బీఆర్ఎస్ కేడర్ ఆగలేదు. అటు ఎమ్మెల్యే రఘునందన్ రావు సర్ది చెబుతున్నా బీజేపీ వర్గం తగ్గలేదు. నేతల రాజకీయ ఎత్తుగడ తెలీక.. కార్యకర్తలు కొట్లాటకు దిగారు. పరస్పరం గొడవపడ్డారు. పోలీసులకు పని చెప్పారు.
వేదికపై అంతా కలిసికట్టుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. కార్యకర్తల మధ్యకు వచ్చే సరికి మళ్లీ వార్నింగులు ఇవ్వడం ఆసక్తికరం. రెచ్చగొడితే ఊరుకోమంటూ.. పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. అక్కడలా.. ఇక్కడిలా.. ఇదే కదా పాలి-ట్రిక్స్ అంటే అంటున్నారు.