పోరాటాల పురిటిగడ్డ వరంగల్లో BRS పార్టీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయట. పార్టీకి జిల్లా అధ్యక్షులుగా ఉన్న నేతలు.. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చర్చ జోరుగా సాగుతోందట. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రజా క్షేత్రం విడిచి.. కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
వరంగల్ జిల్లా BRS అధ్యక్షునిగా ఉన్న ఆరూరి రమేష్.. ఎంపీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కారు పార్టీని చాలా మంది నేతలు వీడగా… ఎన్నికల తర్వాత మిగిలిన కీలకనేతలూ కారుకు బైబై చెప్పేశారట. ప్రస్తుతం జిల్లా BRSలో చెప్పుకోతగ్గ నేతల్లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ తప్ప ఎవ్వరూ మిగలలేదు. గులాబీ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితులు ఉండడంతో.. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నియామకానికి అధిష్టానం కూడా ముందుకు రావట్లేదట. ఇక.. తన భార్యకు ఎంపీ టికెట్ కేటాయించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Also Read: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?
జనగామ నియోజకవర్గంలోనూ BRSకు..ఇదే పరిస్థితి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పదవి BRSకు దక్కినా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండట్లేదనే చర్చ జరుగుతోందట. కాంగ్రెస్ హవాలోనూ పల్లాను గెలిపిస్తే తమకు ఒరిగిందేమీ లేదనే నిరాశలో BRS శ్రేణులు ఉన్నారట. దీంతో ఇతర పార్టీల్లోకి వెళ్లడం తప్ప తమకు మరో మార్గం లేదని ఆలోచనలో గులాబీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో మిగిలిన నాయకులు సైతం స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీవైపు చూస్తుంటే… తాము పార్టీలో ఉండి చేసేది ఏముందని గులాబీ శ్రేణులు వాపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
హనుమకొండ జిల్లా అధ్యక్షునిగా ఉన్న వినయ్ భాస్కర్…అనవసర విషయాల్లో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయబోయి.. తానే ఇరుక్కున్నాడన్న అపవాదును మూట గట్టుకున్నారని ఆ పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారట. అభివృద్ధి పనుల విషయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో ఛాలెంజ్ చేసి.. చివరికి తానే ప్రజల ముందు దోషిగా వినయ్ మిగిలిపోయారట. భూముల కబ్జాలు, అవినీతి ఆరోపణలు రావటంతో… ఆయన వెంట ఉన్న శ్రేణులు ఇప్పుడు పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
ఓ వైపు.. BRS అధిష్టానం అవినీతి అక్రమాలకు మారుపేరుగా మారడం.. ఉన్న నేతలు పక్క చూపులు చూస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైందట. ఎంపీ ఎన్నికలకు ముందే పార్టీ మారినా బాగుండేదని చర్చ జోరుగా సాగుతోందనే టాక్ నడుస్తోంది. మిగిలిన కొందరూ… స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కారును వీడేందుకే సిద్ధం అయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.