Ragging | కాలేజీలో చదువుకోవాల్సిన విద్యార్థులు తమ కంటే జూనియర్లను ర్యాగింగ్ లాంటి అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్ స్టూడెంట్స్ ని ఆటపట్టించేందుకు బట్టలు విప్పమన్నారు. కానీ వారు చెప్పినట్లు జూనియర్ స్టూడెంట్స్ చేయలేదు. దీంతో ఆ సీనియర్ స్టూడెంట్స్ అంతా కలిసి జూనియర్లను బెల్ట్, రాడ్లతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ నగరంలోని హార్’కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్సిటీ (హెబిటియు)లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న 8 మంది విద్యార్థులు బిటెక్ ఎలెక్ట్రానిక్స్ మూడో సంవత్సరం చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులను ర్యాగింగ్ చేసి దారుణంగా చితకబాదారు. ఈ ఘటన తరువాత బాధితుల్లో ఒకరు స్థానికంగా ఉన్న నవాబ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 (హత్యాయత్నం), సెక్షన్ 115 (2) ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, సెక్షన్ 125 ప్రాణాపాయ స్థితిని సృష్టించడం, సెక్షన్ 351 బెదిరించడం, సెక్షన్ 352 ఉద్దేశపూర్వకంగా అవమానించడం, లాంటి ఆరోపణలతో పాటు ర్యాగింగ్ ఆరోపణలు పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. రెండు రోజుల క్రితం హెబిటియు యూనివర్సిటీ హాస్టల్ లో ఉంటున్న థర్డ్ ఇయర్ ఎలెక్ట్రానిక్స్ స్టూడెంట్స్ రాత్రివేళ గదిలో ఉండగా.. వారిని సీనియర్ విద్యార్థులు బర్త్ డే పార్టీకి రావాలని పిలిచారు. కాలేజీ హాస్టల్ కోడ్ భాషలో బర్త్ డే పార్టీ అంటే ర్యాగింగ్ అనే అర్థం. ఇది విన్న ఆ మూడో సంవత్సరం విద్యార్థులు భయపడుతూ సీనియర్ల వద్దకు వెళ్లారు. అయితే ఫైనల్ ఇయర్ చదువుతున్న సీనియర్లు ఆ ముగ్గురినీ పిలిచి డాన్సులు చేయమని చెప్పారు. వారంతా ఇష్టం లేకపోయినా డాన్స్ చేశారు. కానీ ఆ తరువాత బట్టలు పూర్తి విప్పేసి.. నగ్నంగా డాన్స్ చేయమన్నారు.
Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..
దీంతో ఆ ముగ్గురు ఆగిపోయారు. తాము ఇదంతా ఫ్రెషర్లుగా యూనివర్సిటీకి వచ్చినప్పుడు చేశామని.. ఇక తమను వదిలేయమని అడిగారు. చెప్పింది చేయకపోవడంతో ఆ 8 మంది సీనియర్లు కోపంగా మాట్లాడారు. చెప్పినట్లు చేయకపోతే ఇక్కడే చంపేస్తామని బెదిరించారు. అయినా ఆ ముగ్గురు బాధితులు ఈ సారి భయపడలేదు. దీంతో సీనియర్లు.. వారిని కర్రలతో, ఇనుప రాడ్లతో, బెల్టుతో చితకబాది వెళ్లిపోయారు.
ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితులు, కాలేజీ మేనేజ్మెంట్ విచారణ హాజరు కావాలని పిలిచారు. మరోవైపు ఈ విషయంలో కాలేజీ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ గా విచారణ ప్రారంభించింది. ఇది ర్యాగింగ్ కేసు కాదని కాలేజీ నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా కాలేజీకి వచ్చే ఫ్రెషర్లను ఫైనలియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తారు. కానీ ఈ ఘటనలో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ బాధితులు కావడంతో ఇదంతా హాస్టల్ లో రెండు వర్గాల మధ్య గొడవని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలో ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం. ర్యాగింగ్ చట్టం 2011 ప్రకారం.. కాలేజీ, విద్యాసంస్థల లోపల గానీ, బయట గానీ ర్యాగింగ్ చేస్తే.. రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది.