BRSV Meeting : ఓ వైపు గ్రూప్ 1 అభ్యర్థులు నిరసన బాట పట్టిన ఈ సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్వీ నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనగా, సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సదస్సులో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) తెలంగాణ రాష్ట్రం కోసమే ఆవిర్భవించిందన్నారు. పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని చెప్పారు. రాజ శేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత అని మాట్లాడారు. నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరో తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి, మనకి ముఖ్య మంత్రి కావడం దౌర్భాగ్యమన్నారు.
గ్రూప్ 1 అభ్యర్థుల కోసం పోరాటం
దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఎందరో విద్యార్ధి అమర వీరుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా తెలంగాణ భవన్ అక్కున చేర్చుకుంటుందని స్పష్టం చేశారు. జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వారి కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అక్కడ ఎక్కడ చూసినా పోలీసులను దింపారని మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థులే తెలంగాణ భవన్కు వచ్చారని, వారికి అండగా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు.
ALSO READ : హరీష్ రావుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క
హామీల అమలులో మోసాలు
రాష్ట్రంలో రైతు బంధు, రుణమాఫీ ఊసే లేదన్నారు కేటీఆర్. ఢిల్లీకి మూటలు తీసుకోని పోతున్నారని, ఇప్పటి వరకు 25 సార్లు రేవంత్ హస్తినకు వెళ్లారని చెప్పారు. తులం బంగారం ఏమైంది అన్నందుకు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, రాష్ట్రంలో మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతుంటే బీజేపీ మౌనంగా ఉంటోందని విమర్శించారు. డిసెంబర్ 3న బీఆర్ఎస్ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదని చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేకతను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిందని, అందుకే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగితే, ఎటువంటి సమాచారం బయటకు రాలేదని, బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.
ప్రభుత్వంతో మీడియా కుమ్మక్కు
ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సదస్సు పెట్టుకోవాలని, కమిటీలు వేసుకోవాలని సూచించారు కేటీఆర్. తన కంటే అద్భుతంగా మాట్లాడే నాయకులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి మీడియా కొమ్ము కాస్తోందన్న ఆయన, బీఆర్ఎస్ పోరాటాన్ని మీడియా చూపించడం లేదని ఆరోపించారు. అందుకే, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని అక్కడివారికి సూచించారు. ప్రతి కాలేజీలో బీఆర్ఎస్వీ జెండా ఉండాలని, విద్యార్థులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.