Minister Seethakka : తమ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండగకు ఇచ్చిన బతుకమ్మ చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచిందని గుర్తుచేశారు. పదేళ్ల గత పాలకుల తప్పిదాలను సరి చేస్తూనే, మహిళా సాధికారత లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ఆమె వివరించారు.
సూరత్ చీరలిచ్చి –
పదేళ్ల నాడు బతుకమ్మ చీరలంటూ సూరత్ నుంచి నాశిరకం పాత చీరలు తెచ్చి పండగ పూట తెలంగాణ ఆడ బిడ్డలను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రూ. 300 కోట్లతో నాటి ప్రభుత్వం బతుకమ్మ చీరలు కొనుగోలు చేసినా, మహిళలు వాటిని ఏనాడూ కట్టుకోలేదని వివరించారు. బతుకమ్మ చీరలతో సిరి సిల్లలో నేత కార్మికులకు పని దొరుకుతుందంటూ బీఆర్ఎస్ ప్రచారంలో నిజం లేదన్నారు. చీరల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడిన నాటకానికి స్వస్తి చెప్పి తమ ప్రభుత్వం ఆడ బిడ్డలను ఆర్థికంగా, సామాజికంగా సాధికారత చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు.
ALSO READ : మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు… ఏమన్నారంటే ?
ఇదీ మా విజన్ –
తమ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు బతుకమ్మ చీరలకు మించిన ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి, వారి మీద ఆర్థిక భారం పడకుండా చూశామని, ఇప్పటి వరకు 98.50 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించగా, ఇప్పటికి దీని కోసం తమ ప్రభుత్వం రూ.3,325 కోట్లు (సగటున నెలకు రూ. 332 కోట్లు) ఖర్చు చేసిందని లెక్క చెప్పారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి ఒకసారి చీరల కోసం వెచ్చించిన రూ. 300 కోట్లకు పది రెట్లు ఎక్కువని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1200గా ఉండగా, తాము మహిళలకు రూ. 500కే అందిస్తున్నామని, దీనిపై ఇప్పటికి రూ. 300 కోట్లు వెచ్చించామని, అలాగే, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం కోసం తమ ప్రజా ప్రభుత్వం రూ. 1000 కోట్లు చెల్లించిందని గణాంకాలతో సహా వివరించారు. ఇది గాక, డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆయా గ్రూపులు కట్టాల్సిన రూ. 400 కోట్ల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం సదరు బ్యాంకులకు చెల్లించటమే గాక మరో రూ. 1000 కోట్లు చెల్లించేందుకు ప్రయత్నాలు ఆరంభించిందనే విషయాన్ని హరీష్ రావు గుర్తుంచుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. మహిళలకు, నిరుద్యోగులకు ఎంతో అన్యాయం జరిగిందని.. ప్రజలు అన్ని విషయాలు గమనించారని మంత్రి సీతక్క తెలిపారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు న్యాయం చేయలేదని.. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పి సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు.