CM Revanth on Musi River : మూసీ నదీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ మహానగరంలో అధికారుల బృందం నిద్రహారాలు మాని ప్రతీ ఇంటికి వెళ్లి మూసీ పరివాహిక ప్రాంతంలో, మూసీ నదిలో నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారని సీఎం అన్నారు.
విధిలేని పరిస్థితుల్లో దుర్భరమైన, దుర్గంధమైన ప్రదేశాల్లో జీవితాలను గడుపుతున్న పేద ప్రజలను కలిసి వాళ్ల సమాచారాన్ని సేకరిస్తోందన్నారు. బాధితులను ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచిస్తోందన్నారు. ఇందుకు అయ్యే ఖర్చుకు సైతం వెనకాడకూడదని నిర్ణయించుకున్నామన్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని, దీన్ని తెలంగాణ వాసులకే చెందేలా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంపై ఉందని సీఎం గుర్తు చేశారు.
ఇక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుందని, ఈ మేరకు అదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. యువతకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రీయల్ సెక్టార్ ను బలోపేతం చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ బీజేపీల బురద…
పేదల కోసం తమ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే, బీఆర్ఎస్, బీజేపీలు తమపై బురద జల్లుతున్నాయని సీఎం ఆగ్రహించారు. సర్కారు విధానాలపై ఆయా పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారమని మండిపడ్డారు. రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
మీ ముగ్గురూ మూసీ ఒడ్డున ఉంటారా ? :
మూసీ సుందరీకరణ కోసం తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్న మాట మంత్రి హోదాలో కేటీఆర్ అనలేదా అని సీఎం ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న నేతలు ఒక 3 నెలలు పాటు మూసీ ఒడ్డున జీవించాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్3 నెలలు మూసీ నదిలో ఉంటారా, మీకు కావాల్సిన వసతులు కూడా తామే కల్పిస్తామని నిలదీశారు. ఈ మూడు నెలలు ఆ ముగ్గురూ అక్కడ నివసిస్తే ప్రక్షాళన కార్యక్రమాన్ని నిలిపేస్తామని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వాలి…
మూసీ ప్రజల కోసం ఏం చేద్దాం ఎలా చేద్దాం అన్న విషయాలను అసెంబ్లీలో సలహాలు ఇవ్వాలని సీఎం సూచించారు. ఇదే సమయంలో మూసీ పునరుజ్జీవం కోసం విపక్షాల వద్ద ఏదైనా ప్లాన్ ఉన్నా సరే, తమకు చెప్పాలని కోరారు. ఇక తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు రావాలని, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. లేదా మూసీ విషయంలో మీకేమైనా సందేహాలు ఉంటే తమతో పంచుకోవాలని కానీ ఇలా ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించడమేంటన్నారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలన్నదే సర్కార్ ఆలోచనని అన్నారు.
ఎక్కడికైనా వస్తా…
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాజెక్టులపైనా సీఎం మాట్లాడారు. ఈ మేరకు రంగనాయక్సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు రమ్మంటే ఎక్కడికైనా తాను చర్చలకు వస్తానన్నారు. మల్లన్న సాగర్, వేమలఘాట్లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలన్నారు. రాత్రికి రాత్రే పోలీసులతో కొట్టించారన్నారు. గుర్రాలతో తొక్కించి మేం ఖాళీ చేయించట్లేదని ఎద్దేవా చేశారు.
కాలుష్యానికి ప్రతీక…
మూసీ నది ప్రస్తుత కాలంలో కాలుష్యానికి మారు పేరుగా నిలిచిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 1600కుపైగా నివాసాలు పూర్తిగా మూసీ నదిలోనే ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
రూ.25 వేలు ఇస్తున్నాం…
ప్రభుత్వం తరఫున బాధితులను ఏకపక్షంగా, ఉన్నపళంగా ఖాళీ చేయించట్లేదని సీఎం వివరించారు. నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాకే ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. ఇదే సందర్భంగా వారికి రూ.25వేలు సైతం ఇస్తున్నామన్నారు.
హైడ్రా ఏ తప్పు చేయలేదు…
ఇక చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలను మాత్రమే హైడ్రా కూల్చిందన్నారు సీఎం. పరివాహక ప్రాంతాల్లోని ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లలేదన్నారు. హైదరాబాద్ నగరంలో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోందని, చినుకు పడితే చాలు రోడ్లపై వర్షపు నీరు చెరువులు, నదులను తలపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వర్షం నీరు మహానగర రోడ్లపైనే ఉండాలా లేక చెరువుల్లో ఉండాలా అని ఆయన బీఆర్ఎస్, బీజేపీ నేతలను నిలదీయడం గమనార్హం.
ఆయన పేరే ఓ ఐటీ విప్లవం…
భారత్ లో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాయకత్వం వహించారన్న రేవంత్, కంప్యూటర్తో ఉద్యోగాలు, ఆదాయాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ విజన్తోనే ఇది సాధ్యమైందని అన్నారు.
ఆ ముగ్గురు ప్రధానులే లేకుంటే…
అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు సరళీకృత విధానాలతో ప్రపంచంలోని దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. నెహ్రూ, రాజీవ్, పీవీ.. ముగ్గురు ప్రధానుల వల్ల దేశం అభివృద్ధి బాటలో నడిచిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని, దీన్ని కొనసాగించాలన్నదే తమ సంకల్పమన్నారు.
రూ.141 కోట్లను లక్షన్నర కోట్లంటారా ?
మూసీ పునరుజ్జీవనం కోసం 5 కన్సల్టెన్సీ సంస్థలు పనిచేస్తున్నాయి. వీటితో ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది కేవలం రూ.141 కోట్లకు మాత్రమే. మరి రూ. లక్షన్నర కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. ఇదంతా దుష్ప్రచారం అని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ఈ 5 కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందినవని, గుజరాత్లోని పటేల్ విగ్రహం, హైదరాబాద్లోని సమతా మూర్తి విగ్రహంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులను పూర్తిచేసిన చరిత్ర వీటికి ఉందన్నారు. తొలి 18 నెలల్లో ఈ 5 కంపెనీలు, మూసీని అధ్యయనం చేసి రూట్ మ్యాప్ రెడీ చేసి, దశల వారీగా నదికి పునరుజ్జీవం కల్పిస్తాయన్నారు.
also read : వరదలకు మహానగరాలు విలవిల.. హైదరాబాద్ను రక్షించేది హైడ్రానే!