Suman Praises KCR: ఒకప్పుడు సినిమాల్లో దేవుడి పాత్రల్లో నటించి ఫేమస్ అయిన యాక్టర్ సుమన్ (Suman). ఆయన హీరోగా కూడా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం హీరో, హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేస్తూ కెరీర్ను నడిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ యాక్టర్ యాదాద్రి (Yadadri) లక్ష్మీనరసింహ స్వామిని సందర్శించారు. ఒకప్పటికి, ఇప్పటికి యాదాద్రి చాలా మారిపోయింది. అదే విషయాన్ని సుమన్ కూడా ఒప్పుకున్నారు. అంతే కాకుండా యాదాద్రి అలా అవ్వడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను ప్రశంసిస్తూ సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణకే గర్వకారణం
‘‘శ్రీ లక్ష్మీనసింహస్వామి దర్శనం కోసం యాదాద్రి వచ్చాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ గుడికి మార్పులు చేస్తున్నప్పుడు వచ్చాను. అప్పటికీ పూర్తిగా అవ్వలేదు. అప్పుడు వచ్చి అన్నీ చూశాను. మొత్తం పూర్తయిన తర్వాత రావడం ఇదే మొదటిసారి. నిజంగా ఈ విషయంలో కేసీఆర్ను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేదో నాకు తెలుసు. అదే ఇప్పుడు చూస్తుంటే చాలా మార్పు ఉంది. ఇది మన తెలంగాణకే గర్వకారణమయిన విషయం. దీనికి ఎంతమంది కష్టపడ్డారు? ఎంత నష్టం జరిగింది? అంతా నాకు తెలుసు. మొత్తానికి ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఈ గుడి అద్భుతంగా మారింది’’ అంటూ యాదాద్రి గురించి చెప్తూ కేసీఆర్ను ప్రశంసించారు సుమన్.
Also Read: బన్నీ బావ కోసం రంగంలోకి స్టార్ హీరో… ఆ క్రేజీ ప్లాన్ వర్కవుట్ అయితే రికార్డులు గల్లంతే
అదంతా నాకు తెలుసు
‘‘తెలంగాణలో మాత్రమే కాదు.. నార్త్ ఇండియా నుండి కూడా ఈ గుడికి వస్తున్నారు. సౌత్ ఇండియా నుండి కూడా అందరూ రావాలి. అసలు లక్ష్మీనరసింహ స్వామి అంటే వెంటనే యాదాద్రి గురించే మాట్లాడుతున్నారు. అలా చాలామంది వచ్చి వెళ్తున్నారు. స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. వచ్చిన వాళ్ల కష్టాలు అన్నీ తీరిపోవాలి. ఈ గుడి కేవలం అద్భుతం మాత్రమే కాదు అంతకు మించి. ఎందుకంటే ఇదంతా ఒకప్పుడు ఎలా ఉండేదో నాకు తెలుసు. నడిచే దారిలో ఎలా ఉండేదో నాకు తెలుసు. ఈ గుడి లోపలికి రాగానే అన్నీ మర్చిపోతున్నాం. ఇంత అద్భుతంగా కట్టినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు చెప్పాలి’’ అంటూ చేతులెత్తి నమస్కరించారు సుమన్.
ఒకరి వల్ల కాదు
‘‘కేసీఆర్తో పాటు కలిసి ఈ గుడి ఇలా అవ్వడానికి కారణమయిన అందరికీ నమస్కారం. ఎవరో ఒకరి వల్ల ఇదంతా అయ్యిందని చెప్పను. గుడిని అధికారులు శుభ్రంగా చూసుకుంటున్నారు. అలాగే మనం కూడా శుభ్రంగా ఉంచాలి. ఇంత కష్టపడి ఈ గుడిని మార్చి మనకు ఇచ్చారు. మనం దీనిని కాపాడాలి’’ అంటూ భక్తులను కోరారు సుమన్. అలా యాదాద్రిలో వచ్చిన మార్పులకు క్రెడిట్ అంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు, ఆయన ప్రభుత్వానికే ఇచ్చారు సుమన్. ఇక సుమన్.. యాదాద్రిని సందర్శించుకున్నాడు తన చేతికి గాయంతో కనిపించారు. ఆయనకు అసలు ఏమైంది అని కూడా సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.