తాజాగా.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బాషా రాసలీలలు బయటపడ్డాయ్. పేద మహిళలే టార్గెట్గా ఖాదర్ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన అసలు స్వరూపం ఏమిటో అందరికీ అర్థమైంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో.. ఖాదర్ భాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకొచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. దాంతో.. అసలు విషయం బయటకొచ్చింది. ఖాదర్ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితురాలే ఎంతో ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడంతో.. ఖాదర్ బాగోతం బయటపడింది. గత ఎన్నికల్లో కుప్పం అబ్జర్వర్గా పనిచేసిన ఖాదర్ భాషా.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా చెబుతుంటారు. మంత్రి తరఫున వ్యవహారాలన్ని చక్కబెడతానని ప్రలోభ పెట్టి.. అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
ఇదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న తిరుపతి జిల్లా సత్యవేడులోనూ ఇలాంటి ఘటనే బయటపడింది. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుదేశం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా.. సొంత పార్టీకి చెందిన మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈ ఎపిసోడ్లోనూ.. బాధితురాలే బయటకొచ్చి అసలు విషయం బయటపెట్టింది. ఎమ్మెల్యే ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. తనపై.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఆమెతో.. ప్రైవేట్ హోటల్లో ఏకాంతంగా గడిపిన వీడియోలను మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే తనను బెదిరించి బలవంతంగా లొంగదీసుకున్నారని.. బాధితురాలు ఆరోపించారు. తన కోరిక తీర్చకపోతే.. కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించారని.. తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి లొంగక తప్పలేదని ఆవిడ వాపోయారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని.. ఆత్మహత్య చేసుకుంటున్నానని సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.
Also Read: సజ్జల విచారణకు వెళ్తారా? మీడియా ముందు ఎమోషనల్ స్పీచ్.. మరిన్ని చిక్కులు తప్పవా?
బాధితురాలి ఆరోపణలతో.. టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన ఆరోపణలను సీరియస్గా పరిగణించి.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంత జరిగినా.. ఎమ్మెల్యే ఆదిమూలంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇంత పెద్ద దుమారం రేగిన తర్వాత కూడా.. ఆయనకు సంబంధించిన మరో ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఓ మహిళతో.. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్గా మారింది. దాంతో.. ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళతో అసభ్యకరంగా మాట్లాడి.. అడ్డంగా దొరికిపోయారు.
ఇక.. ఎన్నికలకు ముందు కూడా ఏపీలో ఒకరిద్దరు మంత్రులపైనా ఇదే రకమైన ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఆ మధ్య ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. మహిళతో మంత్రి అవంతి రాసలీలల పేరుతో సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అయింది. ఇది.. వైసీపీలో ప్రకంపనలు రేపింది. నాతో అరగంట కూడా గడపలేవా? అంటూ.. మహిళతో సరసాలాడుతున్నట్లుగా ఉన్న ఆడియోపై.. అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. మొత్తానికి.. ఆ ఆడియో అవంతిదో కాదో నిర్ధారణ కాకపోయినా.. రచ్చ మాత్రం పెద్దగానే జరిగింది. మంత్రి అంబటి రాంబాబుపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆయన పేరుతోనూ.. ఓ ఆడియో బాగా వైరల్ అయింది. దాంతో.. ఆ ఆడియో తనది కాదని.. అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. తర్వాత.. దానిపై విచారణ జరుగుతోందని చెప్పినా.. ఇప్పటివరకు ఆ ఆడియో ఎవరిదో తేలలేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఏపీ దేవాదాయశాఖలో పనిచేసే ఓ మహిళా అధికారిణితో ఆయనకు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు.. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. ఇలా.. చిన్నా, పెద్దా.. అనే తేడా లేకుండా కీలక పదవుల్లో ఉన్న నాయకులంతా.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు.
చాలా మంది రాజకీయ నాయకులకు.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. ఏదైనా చేసేయొచ్చనే పిచ్చి ఆలోచనలు పెరిగిపోతున్నాయ్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం, ఏదో ఒకటి ఆశ చూపి.. వాళ్లను లొంగదీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇందుకు.. తాజాగా రాయచోటిలో జరిగిన ఘటనే పెద్ద ఉదాహరణ. కొందరు నేతలైతే.. ఏకంగా మహిళల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ.. తమ లైంగిక అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇలాంటి వేధింపులు భరించలేక.. బాధిత మహిళలే బయటకొచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అలా.. రాజకీయం ముసుగులో వాళ్ల కుళ్లు వ్యవహారాలు, ఒక్కొక్కరి బాగోతాలు బయటకొస్తున్నాయ్. ఇంత మంది వ్యవహారాలు బయటకొచ్చి.. వాళ్ల పరువంతా పోయినా.. కొందరు నాయకుల తీరు మాత్రం మారడం లేదు. ఇంకా.. సిగ్గులేకుండా మహిళల్ని లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు.