TDP Office Attack Case: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిందా? 100 రోజులపాటు సైలెంట్గా ప్రభుత్వం.. దూకుడు పెంచిందా? వైసీపీ కీలక నేత సజ్జలకు నోటీసులు ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారా? కొన్ని కేసుల్లో సజ్జల రోల్ ఉంటున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోందా? పార్టీకి దూరంగా ఉండాలని కొందరు నేతలు నిర్ణయించుకుంటున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. చట్టం ముందు అందరూ ఒక్కటే.. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తరచూ మీడియా ముందుకొచ్చి చెప్పేమాట. వారు తప్పు చేసినట్టు మా దగ్గర ఆధారాలున్నాయి.. లేవని నిరూపించుకోవాలని సూచన చేసేవారు. ఇదంతా ఒకప్పటి మాట. లేటెస్ట్గా సజ్జల వాయిస్ మారింది, ఎప్పుడూ లేని విధంగా ఎమోషన్ అవుతూ కనిపించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు బుధవారం సజ్జలకు నోటీసులు ఇచ్చారు. గురువారం ఉదయం 10 గంటల సాయంత్రం నాలుగు గంటల లోపు హాజరు కావాలన్నది అందులోని సారాంశం. మరి సజ్జల హాజరవుతారా? ప్రస్తుతం బిజీగా ఉన్నామని మరో రోజు వస్తానని చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
పోలీసుల నోటీసుపై బుధవారం మీడియా ముందుకొచ్చారు వైసీపీ కీలక నేత సజ్జల. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఎప్పుడో క్లోజ్ అయ్యిందన్నారు. ఆ కేసులో తాను 131వ నిందితుడిగా చేర్చారన్నది ఆయన వెర్షన్. తనపై తప్పుడు కేసు పెట్టారని, న్యాయపోరాటం చేస్తానన్నారు. ఈ కేసు సీఐడీకి అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయంటూ కాసింత స్వరం మార్చి చెప్పారాయన.
ALSO READ: వైసీపీకి మరిన్ని చిక్కులు.. బోరుగడ్డ అనిల్ అరెస్ట్, గుట్టు బయటపెట్టేనా?
వైసీపీ నాయకులు ప్రజల్లోకి తిరగకుండా భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు సజ్జల. మా పార్టీ ఉండకూడదనే కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. రెడ్ బుక్ పేరుతో వేధింపులకు పాల్పడుతోందన్నది ఆయన మాట. ఈ కేసు వ్యవహారంపై ఇదివరకే సజ్జల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 25 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ప్రొటెక్షన్లో ఉన్నపుడు ఎన్వోసీ ఎందుకిచ్చారని అంటున్నారు.
టీడీపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. తప్పు చేసినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, లేవని ఆయన నిరూపించుకోవాలని వివిధ ఛానెళ్ల డిబేట్లో చెప్పుకొచ్చారు. వైసీపీ మాదిరిగా తాము నోటీసులు ఇవ్వ కుండా అర్థరాత్రి వేళ అరెస్ట్ చేయలేదంటున్నారు. విదేశాలకు వెళ్లేవారికి మాత్రమే లుక్ అవుట్ నోటీసులు ఇస్తారని, లోకల్లో తిరిగే నోటీసులు ఎందుకిస్తారని అంటున్నారు. సజ్జల ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారని అంటున్నారు.
నోటీసులపై అధికారులేమంటున్నారు? ఆఫీసుపై దాడి కేసులో ఇప్పటివరకు 65 మందిని విచారించారు మంగళగిరి పోలీసులు. ఇంకా పలువుర్ని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. మునుముందు అరెస్టులు ఉండే అవకాశముందని చెబుతున్నారు.
వైసీపీ అరాచకాలపై గత ప్రభుత్వంలోని అధికారులు అంతర్గతంగా చర్చించుకోవడం మొదలైంది. ఇదే కాకుండా ఇప్పటివరకు నమోదైన కేసులు ఆయన చుట్టూ తిరుగు తున్నాయని అంటున్నారు. ఆ కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తాము చాలా తప్పు చేశామని ఆయా అధికారులు.. తమ మిత్రుల వద్ద వాపోతున్నారట.