Nellore Heavy Rains: ఏపీకి తుపాను గండం గడిచింది. చెన్నై- నెల్లూరు మధ్య ప్రాంతం తడ వద్ద తీరం దాటింది వాయుగుండం. ఈ విషయాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
వాయుగుండం తీరం దాటడంలో ఏపీలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకింది.
అనంతరం అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వాయుగుండం కారణంగా ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు వాయుగుండం చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంగా కేంద్రీకృతమైంది. అది క్రమంగా బలహీనపడుతూ వచ్చింది.
ALSO READ: బిగ్ అలర్ట్.. ఆ జిల్లాలకు వరద ముప్పు
వాయుగుండం తీరం దాటే సమయంలో ఎక్కడా వర్షపు జాడ కనిపించ లేదు. తీరం దాటడానికి ముందు ఆరు గంటల నుండి 22 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలిన తుఫాను ఆ తర్వాత నెమ్మదించింది.
ఇదిలావుండగా మరో పది రోజుల్లో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒకటి ఉండనుంది. ఇది వాయవ్య దిశగా పయనించి 24 నాటికి ఒడిశా తీరానికి చేరుతుందని ఓ అంచనా.
అంతా అనుకున్నట్లు జరిగితే బంగ్లాదేశ్ తీరం దాటే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇదే కాకుండా ఈనెల చివరలో మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ఏపీపై పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ, విస్తారంగా వర్షాలు పడవచ్చని అంటున్నారు.