Supreme Court CJI Sanjeev Khanna | దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మరో నెల రోజుల్లో కొత్త చీఫ్ జస్టిస్ రాబోతున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సిజెఐ) డివై చంద్రచూడ్ సుప్రీం కోర్టు సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సంజీవ ఖన్నా పేరుని బుధవారం కేంద్రానికి సూచించారు. గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ కు లేఖ రాసింది. ఆ లేఖలో ఆయన తదుపరి చీఫ్ జస్టిస్ పేరుని ప్రస్తావించాలని.. మెమోరాండమ్ ప్రొసీజర్ ప్రకారం రెకమెండ్ చేయాలని అడిగింది.
ప్రస్తుత సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10, 2024న ముగియనుంది. రెండేళ్ల క్రితం ఆయన డిసెంబర్ 17, 2022న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశపు 50వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సుప్రీం కోర్టులోని మహాత్మ గాంధీ విగ్రహానికి నివాశులర్పించారు. జస్టిస్ డివై చంద్రచూడ్ తండ్రి వైవి చంద్రచూడ్ భారతదేశపు సుప్రీం కోర్టు లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. ఆయన ఫిబ్రవరి 22, 1978 నుంచి జూలై 11, 1985 వరకు ఏడు సంవత్సరాలకు పైగా సిజెఐ పదవిలో ఉన్నారు.
Also Read: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..
తదపరి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరు?
జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 10, 2024 నుంచి మే 13, 2025 వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి చేపట్టనున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ప్రస్తుతం సిజెఐ చంద్రచూడ్ తరువాత ఆయనే సీనియర్ మోస్ట్ జడ్డి. జస్టీస్ సంజీవ్ ఖన్నా జనవరి 2019 నుంచి సుప్రీం కోర్టులో జడ్జిగా సేవలు అందిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఆయన పనితీరు, తీసుకున్న నిర్ణయాలుతో ప్రశంసలందుకున్నారు. ఆయన జుడిషియల్ కెరీర్ లో ఒక వివాదం ఉంది. సుప్రీం కోర్టు జడ్జిగా ఆయన నియామకం చాలా వివాదాస్పదంగా జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సుప్రీం కోర్టు జడ్డిగా నియామక ప్రక్రియలో ఆయన కంటే 33 సీనియర్ జడ్జీలు ఉండగా.. వయసులో, అనుభవంలో చాలా చిన్నవాడైన సంజీవ్ ఖన్నాకు ఆ అవకాశం లభించింది. అయితే ఈ వివాదాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా తన పనితీరుతో కొన్ని నెలల్లోనే అధిగమించారు.
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు.. ఎమర్జెన్సీకి నిరసనగా సుప్రీం కోర్టు జడ్జి అయిన జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా తన పదవికి రాజీనామా చేశారు. జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా సోదరుడి కుమారుడే ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా. జస్టిస్ హన్స్ రాజ్ ఖన్నా తన పదవి కాలంలో సుప్రీం కోర్టులో అందించిన సేవలకు గుర్తింపు పొందారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నాకు రెండు దశాబ్దాల జుడిషియల్ అనుభవం
సుప్రీం కోర్టులో జడ్డిగా నియామకం పొందే ముందు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టులో 14 సంవత్సరాలు సేవలందించారు. ట్యాక్సేషన్, కమర్షియల్ చట్టాలలో ఆయనకు మంచి పట్టు ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఈ రంగాలలో ఆయన పలు కీలక తీర్పులు వెలువరించారు. మే 14, 1960లో జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి.. 1983లో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఢిల్లీ జిల్లా కోర్టుల్లో ఆయన తన కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత ఢిల్లీ హై కోర్టు, ట్రిబనల్స్ లో వాదించేవారు. సంజీవ్ ఖన్నా ఎక్కువగా రాజ్యాంగ చట్టాలు, డైరెక్ట్ ట్యాక్స్, కంపెనీ లా, భూ చట్టాలు, పర్యవరణ చట్టాలు, బిజినెస్ కార్పొరేట్ తగాదాల్లో ఆర్బిట్రేషన్ లాంటి కేసులు ఆయన వాదించారు.