BJP: కేసీఆర్ పై ఈమధ్య తరచూ ఓ ఆరోపణ వినిపిస్తోంది. దేశంలోని అనేక పార్టీలకు కేసీఆర్ నిధులు ఇస్తున్నారనేది ఆ ఆరోపణ. ప్రైవేట్ జెట్స్ లో సూటుకేసుల్లో డబ్బులు పంపిస్తున్నారనే విమర్శ. ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు. బీజేపీ నేతలే పదే పదే ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ నుంచి డబ్బులు తీసుకుంటున్నవన్నీ బీజేపీ వ్యతిరేక పార్టీలేననే అనుమానం కాబట్టి.
ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో సైతం ఇలానే ప్రైవేట్ జెట్ లో డబ్బులు తరలించారనే ప్రచారం జరిగింది. ఆ ప్రైవేట్ విమానాలను నడిపించే సంస్థ అధినేతను సైతం సీబీఐ ప్రశ్నించింది. ఓ స్కాం కోసమే విమానంలో డబ్బులు తరలిస్తే.. ఇక పలు పార్టీలకు ప్రైవేట్ జెట్లలో నోట్ల కట్టల సూటుకేసులు పంపించారనడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు.
అప్పట్లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు అఖిలేష్ యాదవ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి అదే విమానంలో వెళ్లిపోయారు. వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో వచ్చిన యాదవ్.. వెళ్లేటప్పుడు ఆ విమానంలో సూటుకేసులతో వెళ్లారనే ప్రచారం అయితే జరిగింది. ఇందులో నిజమెంతో వారికే తెలియాలి.
తాజాగా, బీఎల్ సంతోష్, బండి సంజయ్ సైతం కేసీఆర్ పై ఇలాంటి ఆరోపణలే చేయడం కలకలం రేపుతోంది. తెలంగాణ సంపదను.. రాజకీయ ప్రయోజనాల కోసం దేశమంతా పంచుతున్నారని బీఎల్ సంతోష్ విమర్శించారు. సంతోష్ అంతటిస్థాయి ఉన్న నాయకుడు.. వేక్ గా ఇలాంటి ఆరోపణలు చేశారని అనుకోలేం. ఆయన దగ్గర పక్కా సమాచారమే ఉండి ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో చీమ చిటుక్కుమంటే కేసీఆర్ కు తెలుస్తుందని అంటారుగా.. అలానే దేశంలో ఏ చిన్న హడావుడి జరిగినా అది కేంద్రానికి తెలీకుండా ఉంటుందా? అనేది ప్రశ్న.
బీఎల్ సంతోష్ ఏదో ఫ్లో లో అలా అనేశారని అనుకోలేం. కాస్త గ్యాప్ తో బండి సంజయ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఆసక్తికరం. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని అన్నారు. యూపీ, బీహార్, బెంగాల్, ఝార్ఖండ్, కర్నాటక, తమిళనాడు, కేరళ.. ఇలా వరుసబెట్టి రాష్ట్రాల పేర్లు చదివారు. అయితే, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటంతో ఈ ఆరోపణ నిజమే అనిపించేలా ఉందంటున్నారు. ఆ సొమ్ములు భూములు, కమిషన్ల నుంచి వచ్చాయంటూ బండి సంజయ్ సమర్థింపు.
సంతోస్, సంజయ్ ఆ ఇద్దరు నేతలు ఒకేసారి ఇలాంటి విమర్శలు చేయడం కాకతాళీయం మాత్రం కాకపోవచ్చు. పార్టీ మీటింగులో ఆ మేరకు రాష్ట్ర నేతలకు బీఎల్ సంతోష్ పక్కా ఇన్ఫర్మేషన్ ఇచ్చారని తెలుస్తోంది. కేంద్ర నిఘాలో ఆ విషయం తెలిసినట్టు.. ఆ మేటర్ ను కమలనాథులకు సంతోష్ లీక్ చేసి.. ఇక చెలరేగిపోండని ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. కేంద్రం దగ్గర పక్కా సమాచారం ఉన్నా.. చర్యలు తీసుకుందామంటే సాక్షాలు లేవని చెబుతున్నారు. అందుకే, తెలంగాణ సంపదను దోచుకొని.. దేశమంతా పంచుతున్నారనేలా కేసీఆర్ పై మైండ్ గేమ్ నడిపించాలనేది బీజేపీ వ్యూహం అంటున్నారు.