Vizag tdp politics: విశాఖ టీడీపీలో ఏం జరుగుతోంది? పార్టీ కార్యక్రమాల్లో నేతలు ఎందుకు సైలెంట్ అవుతున్నారు? పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారా? లేక పార్టీయే దూరంగా పెట్టిందా? ఎమ్మెల్యే గంటా ఎందుకు యాక్టివ్ కాలేకపోతున్నారు? ఎంపీ భరత్ కార్యక్రమాలకు ఆయనెందుకు దూరంగా ఉంటున్నారు? వీటిపై విశాఖ టీడీపీలో అంతర్గతంగా నేతల మధ్య చర్చ జోరుగా సాగుతోంది.
ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోట. ఎన్టీఆర్ హయాం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 1982-2014 వరకు ఆయా జిల్లా నుంచి ఎందరో నేతలు మంత్రులయ్యారు. అఫ్ కోర్సు.. ఇప్పుడూ ఉన్నారనుకోండి. కాకపోతే ఈసారి చంద్రబాబు కేబినెట్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు మొండిచేయి మిగిలిందని కొందరు నేతల మాట.
ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ నుంచి టీడీపీ, జనసేన నేతలు విజయం సాధించారు. మాజీ మంత్రులు తమ నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అధినేత ఆలోచన మరోలా ఉంది. రానున్న రెండు దశాబ్దాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గం కూర్పు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులను దూరంగా పెట్టారు.
పార్టీని అంటిపెట్టుకున్న అయ్యన్నపాత్రుడుకి స్పీకర్ పదవి అప్పగించారు. బండారు సత్యనారాయణ మూర్తి, గంటాకు చోటు దక్కలేదు. ఎందుకంటే గంటా, బంగారు వియ్యంకులకు కేబినెట్లో అవకాశం కల్పించారు. గంటా వియ్యంకుడు నారాయణ, బండారు సత్యనారాయణ అల్లుడు రామ్మోహన్ నాయుడు కావడంతో ఆయన్ని దూరంగా పెట్టారు. గాజువాక నుంచి గెలిచిన పల్లాకు టీడీపీ అధ్యక్ష పదవి అప్పగించారు.
ALSO READ: 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
విశాఖలో ఏ కార్యక్రమం చేపట్టినా ఎంపీ భరత్ హైలెట్ అవుతున్నారు. ఆయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు కూడా. భరత్ ఈసారి విశాఖ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.
నార్మల్గా విశాఖ ఎంపీ ఎవరైతే వారు నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉండేది. ఇదంతా ఒకప్పటి మాట. దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ భరత్. నేతలకు, ప్రజల కు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే భరత్ చుట్టూనే విశాఖ రాజకీయాలు నడుస్తున్నాయన్నది కొందరి మాట.
విశాఖలోని నేతలంతా ఎంపీ భరత్కు ప్రయార్టీ ఇస్తున్నారట. ఈ వ్యవహారం ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు మింగుడు పడడంలేదు. విశాఖ టీడీపీలో భరత్ సూపర్ పవర్గా మారుతున్నారనే ప్రచారం లేకపోలేదు. ఎమ్మెల్యేలు చేపట్టిన కార్యక్రమాల్లో ఎంపీ భరత్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన హాజరైన కార్యక్రమాలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దూరంగా ఉంటున్నారనే చర్చ మొదలైపోయింది.
నేతలు సహకరించినా.. లేకపోయినా భరత్ మాత్రం అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఎంపీగా తన పని తాను చేసుకుపోతున్నారు. తన వైపు వస్తున్న నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టేలా వ్యవహారిస్తున్నారాయన. రాబోయే రోజుల్లో విశాఖ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.