BL Santosh: అందరూ బెదిరిస్తుంటారు. అంతా భయపెట్టాలని చూస్తుంటారు. వార్నింగులూ ఇస్తుంటారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ కామన్. అయితే, కీలక పొజిషన్ లో ఉన్నవారు బెదిరిస్తే.. ఆ డైలాగే మరోలా రీసౌండ్ అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడదే జరుగుతోంది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఫాంహౌజ్ కేసు తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఆ వ్యవహారంపై స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారన్నారు. హైదరాబాద్ సంపదను.. రాజకీయాల కోసం దేశమంతా పంచుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు తాను తెలీకపోయినా, ప్రతీఇంటికి తన పేరు తీసుకెళ్లారన్నారు బీఎల్ సంతోష్.
సంతోష్ మాటలను బట్టి ఆయన ఫాంహౌజ్ కేసు విషయంలో సీఎం కేసీఆర్ పై ఎంతగా రగిలిపోతున్నారో అర్థం అవుతోంది. బీజేపీలో నెంబర్ 2గా ఉన్న ఆ నేత.. పర్యవసానాలు ఎదుర్కోక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారంటే.. బీఆర్ఎస్ బాస్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కేసీఆర్ సర్కార్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని.. తెలంగాణపై సంతోష్ ఫుల్ టైమ్ కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మిషన్ 90 పేరుతో రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పై యుద్ధానికి ఆయుధాలకు పదును పెడుతున్నారు.
ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారు. సీబీఐ రిమాండ్ రిపోర్టులో ఆమె పేరు పలుమార్లు ప్రస్తావించారు. ఆ కేసు ఉచ్చు మరింత బిగిస్తుందని అంటున్నారు. అటు, మంత్రులు మల్లారెడ్డి, గంగులపై ఐటీ దాడులు ఉండనే ఉన్నాయి. ఇప్పుడిక కొత్తగా కర్నాటక డ్రగ్స్ కేసు రీఓపెన్ చేస్తామంటున్నారు. ఆ లింకులు నేరుగా కేటీఆర్ కాలికి చుట్టుకుంటాయని చెబుతున్నారు. ఇలా ఫాంహౌజ్ కేసులో బీఎల్ సంతోష్ పేరును ఎంతగా డ్యామేజ్ చేశారో.. అలానే కవిత, కేటీఆర్, కేసీఆర్ ల ఇమేజ్ తో ఆటాడుకోవాలనేది బీజేపీ స్కెచ్ గా తెలుస్తోంది. బీఆర్ఎస్ ను ఆగమాగం చేసి.. నేతలను భయాబ్రాంతులకు గురి చేసైనా.. తెలంగాణలో కమలాన్ని వికసింపజేయాలనే పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ఉందంటున్నారు. ఆ టాస్క్ ను బీజేపీ బిగ్ లీడర్ బీఎల్ సంతోషే స్వయంగా చేపట్టారని తెలుస్తోంది.