BJP: మిషన్ 90. బీజేపీ టార్గెట్ ఇది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాల్లో గెలవాలనేది లక్ష్యం. అందుకే, మిషన్ ఇంపాజిబుల్ ను చేపట్టింది కమలదళం. ఆ మిషన్ ను ఆపరేట్ చేసేది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్. ప్రచారక్ ల భేటీలో ఆ మేరకు గైడ్ లైన్ సిద్ధం చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదంటూ సీఎం కేసీఆర్ కూ వార్నింగ్ ఇచ్చేశారు.
తెలంగాణలో 90 స్థానాల్లో గెలవడమంటే బీజేపీకి బిగ్ టాస్కే అంటున్నారు. మరీ, వార్ వన్ సైడ్ అయితే గానీ కమలం పార్టీకి అన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. 20 సీట్లు గెలవండి చూద్దాం.. అంటూ కాంగ్రెస్ సవాల్ చేస్తోంది. 20 కాదు 90 గెలుస్తామంటూ కాషాయం కదనోత్సాహంలో ఉంది.
అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా? అనేది కాంగ్రెస్ సంధించిన మరో ప్రశ్న. ఉన్నారు.. ప్రజా సంగ్రామ యాత్రలో తాను కళ్లారా చూశానని.. ఎమ్మెల్యే టికెట్ల కోసం తనకే అనేక రిక్వెస్టులు వచ్చాయనేది బండి సంజయ్ ఆన్సర్.
బీజేపీ పట్టణాలకే పరిమితమైన పార్టీ. గ్రామాల్లో లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ లేరనేది ఇంకో ఆరోపణ. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అందుకే, ప్రచారక్ ల భేటీ నిర్వహించి.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోషే నేరుగా రంగంలోకి దిగారు. ఆయనొస్తే మామూలుగా ఉండదుమరి..అంటున్నారు.
బయటకి ఒప్పుకోకపోయినా.. పార్టీ నాయకత్వానికి తెలుసు తమకు చాలాప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు లేరని. అందుకే, ఎప్పటిలానే వలస నేతలను ప్రోత్సహించాలనేది వారి వ్యూహంగా తెలుస్తోంది. కారు పార్టీ ఫుల్లీ ఓవర్ లోడ్ కావడంతో.. అక్కడి నుంచి కొందరిని బయటకు రప్పించాలని భావించారు. కానీ, ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో కమలనాథులు బాగా బద్నామ్ అయ్యారు. ఇప్పుడు ఏ ఒక్క బీఆర్ఎస్ నేత బీజేపీలో చేరినా కూడా.. మళ్లీ ఫాంహౌజ్ ఎపిసోడ్ నే గుర్తు చేస్తుంటారు. కేసీఆర్ కు ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకని.. అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న కాంగ్రెస్ నేతలకు వల విసిరేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.
అవును, ఇప్పుడు బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ లీడర్లే. గతంలో బీజేపీ ఇంతగా దూకుడుగా లేకపోవడంతో ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు సీన్ మారింది. బీఆర్ఎస్ లో ఉండాలంటేనే చాలామంది భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా స్థాయిలో కాంగ్రెస్ కు బలమైన నాయకులు ఉన్నారు. హస్తం పార్టీ వర్గాలుగా చీలిపోవడంతో.. ఈసారి తమకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో లేదోననే టెన్షన్ వారిలో కనిపిస్తోంది. ఈ పరిస్థితిని తమకు అడ్వాంటేజ్ గా మార్చుకోవాలని చూస్తోంది కమలదళం. కాంగ్రెస్ లోని ఎమ్మెల్యే స్థాయి నేతలను బీజేపీలోకి ఆకర్షించాలని.. ఎక్కడెక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో, అక్కడక్కడ కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారు. ఆ బాధ్యతను వలసల కమిటీకి అప్పగించారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఆ కమిటీ పనిచేయనుంది.
ఉద్యమ సమయం నుంచే తెలంగాణ జిల్లాలపై మంచి పట్టున్న ఈటల రాజేందర్ కు ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరం. ఈటలకు మంచి ఇమేజ్ ఉంది. ఆయనపై నమ్మకమూ ఉంటుంది. ఈటల పిలిస్తే నేతలు పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే, ఈటల రాజేందర్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి లాంటి వారితో ప్రత్యేకంగా వలసల కమిటీ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ ను కొల్లగొట్టే బాధ్యతలు వారికి అప్పగించారు బీఎల్ సంతోష్.
బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే బాధ్యతను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చూసుకుంటారు. బలహీనంగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి వలస నేతలను చేర్చుకుని.. పార్టీని బలోపేతం చేసే టాస్క్ ఈటల రాజేందర్ ది. ఇలా పక్కా ప్రణాళికతో పని చేస్తే.. మిషన్ 90.. పెద్ద కష్టమేమీ కాదనేది బీజేపీ లెక్క.