Jio Cloud PC : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన సేవల్ని దేశమంతటా విస్తరించే పనిలో శరవేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టెక్నాలజీని వినియోగదారులకు అందించే ప్రక్రియలో దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు మరో కొత్త సంచలనానికి సిద్ధమైంది. అదేంటంటే? ఒక్క యాప్ సాయంతో స్మార్ట్ టీవిని కంప్యూటర్లా మార్చుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముఖ్యంగా ఇది మధ్య తరగతి వాళ్లకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది.
అదెలా అంటే? – కంప్యూటర్ అనేది ప్రస్తుతం ప్రతీ రంగంలోనూ భాగమైపోయింది. ఎందుకంటే అధిక వేగం, భారీ ఎత్తున సమాచారం నిల్వ, వేగవంతంగా విశ్లేషణ, శాస్త్రీయ పరిశోధన, మనిషి కన్నా వేగంగా క్రోడీకరణ, విశ్లేషణ వంటి వాటిని సునాయాసంగా చేయగలుగుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ సమాచారం కోసం ఇంటర్నెట్ వినియోగించుకునేలా వీలుగా ఉంటుంది. అందుకే దీనిని ఆఫీస్లలతో పాటు ఇళ్ళల్లోనూ వినియోగిస్తుంటారు. దీంతో ఇళ్ళలో టీవీలతో పాటు ఈ కంప్యూటర్ కూడా ఉండటం అనివార్యమైపోయింది.
కానీ మధ్య తరగతి కుటుంబాల విషయానికొస్తే ఇప్పుటికీ చాలా మందికి కంప్యూటర్ కొనుగోలు భారంగానే ఉంది. టీవీ, కంప్యూటర్ రెండూ డివైస్లను కొనడానికి ఎక్కువగా ఇష్టపడరు. అందుకే ఇప్పుడు వారికి ప్రత్యేకంగా కంప్యూటర్ పరికరం కొనుగోలు భారం కాకూడదనే ఉద్దేశంతో కొత్త సాంకేతికను ఆవిష్కరించింది రిలయన్స్ జియో. ఇకపై ఇంట్లో టీవీ, కంప్యూటర్ రెండు వేరు వేరుగా కాకుండా ఒకే దాంట్లోనే రెండు ఉండేలా టెక్నాలజీని పరిచయం చేయనుంది. ఈ అత్యాధునిక టెక్నాలజీని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ – 2024 ఈవెంట్లో ప్రదర్శించింది. దీనిని జియో క్లౌడ్ పీసీగా తెలిపింది. ఈ సాంకేతిక ద్వారా కొన్ని వందల రూపాయలను ఖర్చు చేసి మీ స్మార్ట్ టీవీని ఏకంగా కంప్యూటర్గా మార్చుకోవచ్చని జియో వెల్లడించింది.
ALSO READ : బెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసిన vivo.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!
అవి ఉంటే చాలు – స్మార్ట్ టీవీతో పాటు అంతర్జాల సౌకర్యం, కీబోర్డ్, మౌస్, ఉంటే చాలు.. జియో క్లౌడ్ పీసీ యాప్ను వినియోగించుకుని టీవిని కంప్యూటర్లా మార్చవచ్చని జియో చెప్పుకొచ్చింది. మొదటగా జియో క్లౌడ్ పీసీ యాప్లో లాగిన్ అవ్వాలి. అంతే సింపుల్.. కంప్యూటర్ తరహాలోనే స్మార్ట్ టీవీలో ఈ – మెయిల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి ఫీచర్స్ను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా మొత్తం క్లౌడ్లోనే స్టోర్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు కంప్యూటర్ కొనుగోలు భారం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జియో పేర్కొంది.
అవి అమర్చితే చాలు – జియో క్లౌడ్ పీసీ యాప్ ద్వారా స్మార్ట్ టీవీ, కంప్యూటర్ రెండు వేర్వేరు డివైజులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్న జియో టీమ్.. సాధారణ టీవీలకు జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ఫైబర్ సెట్ టాప్ బాక్స్ అమర్చి స్మార్ట్గా మార్చవచ్చని తెలిపింది. మొబైల్లోనూ కూడా ఈ కొత్త సర్వీస్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ జియో క్లౌడ్ పీసీ యాప్ను ఎప్పుడు విడుదల చేయనుందో? ఎంత ధరకు అందుబాటులో ఉంచనుందో ప్రస్తుతానికి వివరాలు వెల్లడించలేదు. త్వరలోనే జియో వీటి వివరాలను తెలియజేయనుంది.