Mlc Kodandaram : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల గురుకుల హాస్టల్స్ అద్దెలు చెల్లించడంలో కాస్త జాప్యం అయ్యిందని అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు, ఉద్యోగుల డీఏలు గత ప్రభుత్వం నుంచే పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
కుల గణనను స్వాగతిస్తున్నామని, ఇది పారదర్శకంగా జరగాలని కోరారు. కుల గణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలన్నారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడకు పోయిందో తెలియదని చురకలంటించారు కోదండరాం. ఆనాటి సర్వే వివరాలను ప్రజల ముందు పెట్టలేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పచ్చ జెండా ఊపిన ప్రాజెక్టులు, పథకాలను ఇప్పుడు విమర్శిస్తోందని మండిపడ్డారు.
ALSO READ : కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్ రావ్ ఫైర్
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి గానీ, దుర్భాషలాడటం మంచిది కాదని హెచ్చరించారు. మూసీ పునరుద్ధరణ అవసరమైన అద్భుతమైన కార్యక్రమమని చెప్పిన కోదండరాం, పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటామని, నదులు, చెరువుల పునరుద్ధరణ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ దక్కాలని అన్నారు. పట్టణీకరణ మీద అధ్యయనం చేసిన వాళ్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, తాము స్వీకరించిన సలహాలు, సూచనలను ప్రభుత్వం ముందు పెడుతామని తెలిపారు. ఆర్ఓఆర్ బిల్లుపైనా అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కోదండరాం.