Gachibowli Stadium: సాక్షాత్తు సీఎం రేవంత్ ఆదేశాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతోంది. క్రీడలకు కేంద్రమైన గచ్చిబౌలీని ఆటలకు బదులు పాటల కార్యక్రమాన్ని వేదికగా మలచుకోడానికి అనుమతులు ఎలా ఇస్తారు? వేదికల నిర్మాణానికి ట్రాకులు తవ్వేయడం న్యాయమా? ఈ ప్రశ్నలు వేస్తోంది మరెవ్వరో కాదు.. అక్కడ నిత్య ప్రాక్టీస్ కోసం వచ్చే క్రీడాకారులు.. ప్రజలు. మరి, దీనికి అధికారులు ఏమంటారు? ఈ విషయాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం ఇవ్వలేని నిర్వాహకులు ‘బిగ్ టీవీ’ ప్రతినిధిపై దాడికి ప్రయత్నించారు.
దేవి శ్రీ ప్రసాద్ లైవ్ కన్సర్ట్ కోసమే ఇదంతా..
ఈనెల 19న గచ్చిబౌలి ఫుట్ బాల్ స్టేడియంలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ లైవ్ కన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను ఇప్పటికే విక్రయించారు కూడా.
అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్…
ఈ ఈవెంట్ నిర్వహించేందుకు స్టేడియంలోని అథ్లెటిక్ ట్రాక్ పై భారీ సెట్ వేశారు. స్టేజీ కోసం స్టేడియంలో భారీగా గుంతలు సైతం తవ్వారు. స్టేడియం అంతా పాడవుతుందన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన బిగ్ టీవీ ప్రతినిధులపై అక్కడి సిబ్బంది దౌర్జన్యం చేశారు. అక్కడ ఏం జరుగుతుందో, ట్రాక్ ను ఏం చేస్తున్నారో చూద్దామనుకున్న బీగ్ టీవీ జర్నలిస్టులతో అమర్యాదకరంగా ప్రవర్తించారు.
స్టేడియాల్లో వద్దని చెప్పిన సీఎం…
గతంలోనే ఆటలు ఆడే స్థలంలో ఈవెంట్స్ నిర్వహించకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఆయన మాట పట్టించుకోకుండా దేవిశ్రీ ప్రసాద్ ఇవెంట్కు అనుమతి ఇచ్చారు. అక్కడ అంతా తవ్వేస్తున్నారు. అది కవర్ చేయడానికి వెళ్లిన బిగ్ టీవీ సిబ్బందిపై దాడి చేశారు.
రూ.20 కోట్ల భారీ ఖర్చు…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియాన్ని ఈమధ్యే దాదాపుగా రూ.20 కోట్ల భారీ ఖర్చుతో మరమ్మతులు చేపట్టారు. అయితే క్రీడా మైదానాలను కేవలం క్రీడలకే వాడాకోవాలని, ఇతర కార్యక్రమాల నిర్వహణకు, ఈవెంట్స్ కోసం ఇవ్వకూడదని సీఎం స్వయంగా శాట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్న తీరుతో గచ్చిబౌలీ స్టేడియం ఈవెంట్ కోసం రెఢీ అవుతోంది.
తెలుగు మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, టాప్ హీరోలతో ఆయన ఇప్పటికీ వందలాది మెలోడీస్, సూపర్ హిట్ టైటిల్ సాంగ్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేవిశ్రీప్రసాద్, తొలిసారిగా ఓ లైవ్ కన్సర్ట్ ను హైదరాబాద్’లోనే నిర్వహించబోతున్నాడు. ఈ నెల 19న ఈ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది. అయితే, ఆ కార్యక్రమాన్ని గచ్చిబౌలీ స్టేడియంలో కాకుండా మరెక్కడైనా నిర్వహించవచ్చు కదా అని క్రీడాభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఈవెంట్ వల్ల మైదానానికి జరిగే నష్టాన్ని ఎవరు తీరుస్తారని అడుగుతున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను మర్యాదపూర్వకంగా కలిసిన దేవి శ్రీ ప్రసాద్.. వారిని ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానాన్ని సైతం అందజేశారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సైతం వెళ్లిన డీఎస్పీ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రతిష్టాత్మకమైన ఇలాంటి ఈవెంట్ల కోసం క్రికెట్ స్టేడియాలు, ఇతర స్టేడియాలు కాకుండా బహిరంగ స్థలాలు, ఓపెన్ ప్లేసెస్, సిటీకి దూరంగా శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని క్రీడాకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లు ఎదురుచూస్తే గానీ తమ స్టేడియాలు రిపేర్లు కావని, అలాంటి సీఎం రేవంత్ రెడ్డి సుమారు రూ.20 కోట్ల ఖర్చుతో పెద్ద ఎత్తున స్టేడియానికి మరమ్మతులు చేయించి కొత్త సొబగులు అద్దారని అంటున్నారు. క్రీడాకారులకు ఉపయోగపడాల్సిన స్టేడియాలు, మైదానాలు ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తే వాటి నాణ్యత దెబ్బతింటుందని వారు ఆందోళన చెందుతున్నారు.
Also Read : కేటీఆర్ సమావేశానికి వారిద్దరూ డుమ్మా! బీఆర్ఎస్ శ్రేణుల్లో సందేహాలు, హ్యాండిస్తారా?