Chinese Aquarium Whale Shark| డబ్బులు సంపాదించడానికి ఒక చైనా కంపెనీ ప్రజలను మోసం చేసింది. అద్భుతమైన జీవిని చూడండి.. సముద్రంలోనే అతిపెద్ద జీవిని చూడండి అంటూ ప్రగల్భాలు పలికింది. అదంతా విని ప్రజలు టికెట్ కొని ఆ జీవిని చూసేవారు. కానీ చివరకు అది ప్రాణమున్న జీవి కాదు.. ఒక రోబో అని తేలడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటన చైనాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని జియావోమిషా సీ వరల్డ్ ఆక్వేరియంలో వింత చేపలు, ఇతర సముద్ర జీవులు ఉంటాయని ఫేమస్. అందుకే ఈ ఆక్వేరియంలో సముద్ర జీవులు చూడడానికి భారీ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అయితే గత అయిదు సంవత్సరాలుగా ఈ ఆక్వేరియం రెనోవేషన్ కారణంగా మూతపడింది. మళ్లీ ఇటీవలే ఈ ఆక్వేరియాన్ని ప్రారంభించారు. కానీ ప్రారంభానికి ముందు తమ ఆక్వేరియంలో అరుదైన వేల్ షార్క్ చేప ఉందని ప్రకటన చేశారు. దీంతో ఆక్వేరియం అక్టోబర్ 1 రిఓపెన్ చేసిన రోజే ఆ వేల్ షార్క్ చేపను చూడడానికి లక్ష మంది సందర్శకులు వచ్చారు.
ఆక్వేరియం వచ్చిన సందర్శకులకు టికెట్ రేటు కూడా భారీ పెంచారు. తమ ఆక్వేరియంలోని వేల్ షార్క్ చేప ప్రపంచంలోనే అతిపెద్ద చేప అని ఆక్వేరియం కంపెనీ ప్రకటించుకుంది. దీంతో రోజు రోజుకీ ఈ చేపను చూసేందకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో ఈ చేపను చూడాలంటే టికెట్ ధర 40 డాలర్లుగా( దాదాపు రూ.3500) ఆక్వేరియం కంపెనీ పెంచేసింది. కొందరు వేల్ షార్క్ చేప వీడియోలు కూడా తీశారు.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి
ఈ క్రమంలో చేప కదలికలను కొందరు బాగా గమనించారు. ఆ చేప ఏదో ఒక యంత్రంలాగా కదులుతోందని అనిపించింది. దీంతో అది నిజమైన చేప కాదు ఒక యంత్రం.. చేప రూపంలో ఉన్న రోబో అని తెలిసిపోయింది. కొద్ది సేపట్లోనే ఈ విషయం సందర్శకులందరికీ అర్థమైపోయింది. ఒక రోబో చేపను చూపించి తమ వద్ద టికెట్ కోసం వేల రూపాయలు వసూలు చేస్తారా? అని సందర్శకులు ఆక్వేరియం నిర్వహకులితో గొడవకు దిగారు. తమ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై ఆక్వేరియం కంపెనీ స్పందించింది. ఆ చేప ఒక రోబో అని అంగీకరించింది. కానీ సందర్శకులను మోసం చేయడానికి అలా చేయలేదని.. జంతు రక్షణ చట్టాల ప్రకారం.. వేల్ షార్క్ చేపలను వేటాడడం, వాటితో వ్యాపారం చేయడం నిషేధం కాబట్టి.. వేల్ షార్క్ చేపను పోలిన రోబోని తయారు చేశామని వివరణ ఇచ్చింది. ఆక్వేరియం కంపెనీ వివరణలో సంతృప్తి చెందని సందర్శకులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
Also Read: జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!
ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒక యూజర్ అయితే.. తాను కూడా టికెట్ కోసం బాగా ఖర్చు పెట్టి వేల్ షార్క్ చేపను చూడడానికి వెళ్లానని.. కానీ ఇప్పుడు అది ఒక రోబో అని తెలిసి చాలా కొపంగా ఉందని రాశాడు. మరొక నెటిజెన్ కామెంట్ చేస్తూ.. ”నేను వేల్ షార్క్ అని పేరు వింటూనే చాలా ఎక్సైటింగ్ గా ఫీలయ్యాను. కానీ అది ఒక మెషీన్ అని తెలిసి నా ఉత్సాహమంతా పోయింది. ఏదో జంతు సంరక్షణ పేరుతో నిజమైన చేపను చూపించడం లేదని చెబుతున్నారు. కానీ అసలు వారి వద్ద నిజమైన చేప ఒక్కటైనా ఉందా? ఇదేం బాగోలేదు.” అని రాశాడు.
వేల్ షార్క్ సైంటిఫిక్ పేరు రైన్కోడాన్ టైపస్. ఇది షార్క్ చేపల జాతిలో అతిపెద్ద చేప. దీని పొడువు 18 మీటర్లకు పైగా ఉంటుంది. వేల్ షార్క్ చేపను పోలీన రోబోని తయారు చేయడానికి జియమియేషా ఆక్వేరియం సీ వరల్డ్ కంపెనీ కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపింది.
అయితే ఇలా వింత జంతువుల పేరుతో గతంలో కూడా చైనాలో ప్రజలను మోసం చేసిన సందర్భాలున్నాయి. నెల రోజుల క్రితమే వింత పాండాల పేరుతో కుక్కలకు పాండా లాగా రంగులు వేసి సందర్శకులను ఒక జూ పార్క్ మోసం చేసింది.