BRS MLAs meeting: గ్రేటర్ హైదరాబాద్పై బీఆర్ఎస్ పట్టు కోల్పోయిందా? వరుసగా కేటీఆర్ లేవనెత్తిన అంశాలు బూమరాంగ్ అవుతున్నాయా? కేటీఆర్ కీలక సమావేశానికి గ్రేటర్ ఎమ్మెల్యే లంతా వచ్చారా? ఏవేవో సాకులు చెప్పి ఎమ్మెల్యేలు తప్పించుకుంటున్నారా? ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కారు పార్టీ అలర్ట్ అయ్యింది. గ్రేటర్పై పట్టు నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గ్రేటర్లో కొద్దిరోజులుగా ఆ పార్టీలో తలెత్తిన వ్యవహారాలతో కొన్ని వర్గాల ప్రజలు ఆ పార్టీకి దూరమయ్యాయి.
మిగతా వారిని దగ్గర చేర్చుకునేందుకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కీలకమైన సమావేశం నిర్వహించారు కేటీఆర్. అందరూ వచ్చినా ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. వారద్దరు మాస్ నేతలే. ఒకరు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మరొకరు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఉన్నారు.
మనవరాలు పెళ్ళి పనుల్లో బిజీగా ఉండటంతో రాలేనని మల్లారెడ్డి అన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అనారోగ్యం కారణంగా సమావేశానికి రాలేనని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు చెప్పారట.
ALSO READ: ఐఏఎస్ల్లో టెన్షన్.. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది?
ఈ సమావేశంలో మూసీ సుందరీకరణ, హైడ్రాపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు కేటీఆర్. ఈ విషయంలో ఎమ్మెల్యేల నుంచి సమాచారం తీసుకున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్. దాని ఆధారంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు.
మూసీ, హైడ్రా వ్యవహారంలో బాధితులు ఎక్కువగా బీసీ వర్గాల ప్రజలే ఉన్నట్లు బీఆర్ఎస్ అంతర్గత సర్వేలో తేలింది. దీంతో ఆయా వర్గాల వారికి అండగా నిలిస్తే గ్రేటర్లో తమకు ఎదురుండదని ఆలోచన చేస్తున్నారు. గతంలో కూడా కేసీఆర్తో గ్రేటర్ ఎమ్మెల్యేల సమావేశానికి ఇద్దరు రాలేదు. ఇప్పుడు కేటీఆర్ వంతైంది. రేపటి రోజున గ్రేటర్లో ఆ పార్టీ వైపు ఎంతమంది ఉంటారో చూడాలి.
ఇదిలావుండగా బీఆర్ఎస్ కాసింత వీక్ గా మారడంతో టీడీపీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. సైకిల్ ఎక్కేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా అటువైపు చూస్తున్న సంకేతాలు లేకపోలేదు. కాకపోతే కారు పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.