IAS Lunch Motion: ఏపీ-తెలంగాణలో కొందరు ఐఏఎస్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. దీంతో ఆయా ఐఏఎస్లు హైకోర్టు తలుపు తట్టారు. న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తికరంగా మారింది.
2014 ఏపీ విభజన తర్వాత కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. కొందరు తెలంగాణలో.. మరికొందరు ఏపీలో ఉండేందుకు సిద్దమయ్యారు. అయితే ఆలిండియా సర్వీసులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఈనెల 16లోగా చేరాల్సిందేనని క్యాట్ స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయడానికి నిరాకరించింది.
క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఆయా అధికారులు. వారిలో వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్, సృజన, హరికిరణ్, శివశంకర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమను తెలంగాణ, ఏపీలో కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత విచారించునుంది.
క్యాట్ తీర్పుపై హైకోర్టు ఏవిధంగా వ్యవహరిస్తుంది? అన్నదే అసలు పాయింట్. న్యాయస్థానంలో ఊరట లభించకపోతే ఆ ఐఏఎస్ల పరిస్థితి ఏంటి? ఆ ఐఏఎస్లు తాము పని చేస్తున్న రాష్ట్రాన్ని వీడాల్సిందేనా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
ALSO READ: కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్.. రైస్ దొంగలిస్తూ అడ్డంగా..
క్యాట్ తీర్పు అంశాన్ని ఆ అధికారులు తెలంగాణ సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఏం చేయాలి.. ఎలా చేయాలనే దానిపై చర్చలు జరిపారు. హైకోర్టులో ఊరట లభించకపోతే ఏపీ అధికారులు తెలంగాణకు.. తెలంగాణ అధికారులు ఏపీకి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ఇవాళ సాయంత్రానికి ఆ తతంగమంతా జరగాలి.
లేకుంటే అధికారులు డిప్యూటేషన్పై రావాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరహా సమస్యలు ఏపీ-తెలంగాణ మధ్య చాలానే ఉన్నాయని అంటున్నారు కొందరు ఉద్యోగులు. విభజన జరిగి పదేళ్ల తర్వాత ఆలిండియా సర్వీసు అధికారుల ఇష్యూ వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.