BJP: బీఎల్ సంతోష్ హైదరాబాద్ వచ్చారు. బీజేపీ పార్లమెంట్ విస్తారక్ ల సమావేశం కోసం ఎంట్రీ ఇచ్చారు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇలా సిట్ నుంచి సీబీఐకి వచ్చిందో లేదో.. అలా ఢిల్లీ నుంచి విమానంలో దిగిపోయారు బీజేపీ అగ్రనేత. కాకతాళీయమో లేదంటే పక్కా లెక్క ప్రకారమో తెలీదు కానీ.. ఈ రెండు ఘటనలు ఒకేసారి జరగడం మాత్రం ఆసక్తికరం. ఇన్నాళ్లూ సిట్ కు భయపడ్డారని.. ఇప్పుడు సిట్ లేదని ధీమాగా హైదరాబాద్ కు వచ్చారని బీఆర్ఎస్ అంటుంటే.. మీటింగ్ ఉంది కాబట్టి వచ్చారని బీజేపీ చెబుతోంది.
బీఎల్ సంతోష్. బీజేపీలో నెంబర్ 2 పొజిషన్. ఆరెస్సెస్ మనిషి. పార్టీ విషయాల్లో మోదీ, అమిత్ షాల కంటే సంతోష్ కే ప్రాధాన్యం. అలాంటి ఆయన ఊరికే వచ్చుండరు తెలంగాణకి. మిస్టర్ క్లీన్ గా ఉన్న తన ఇమేజ్ ను కేసీఆర్ సర్కారు ఫుల్ డ్యామేజీ చేసిందనే పగతో రగిలిపోయి ఉంటారని అంటున్నారు. అందుకే, కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకే.. హైదరాబాద్ లో ఎంట్రీ ఇచ్చారని కమలనాథులు చెబుతున్నారు.
అది మామూలు సమావేశం కాదు. బీజేపీ చేరికల కమిటీ మీటింగ్. అంటే, వేరే పార్టీ నేతలకు కాషాయ కండువా కప్పేయడమే ఎజెండా. 119 నియోజకవర్గాల బీజేపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం. జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ తో పాటు బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ తదితర పెద్దలంతా హాజరయ్యారంటే అదెంత ఇంపార్టెంట్ మీటింగో అర్థం అవుతోంది.
ఫాంహౌజ్ కేసు తర్వాత బీఎల్ సంతోష్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. నిత్యం ఇక్కడి నేతలతో ఫోన్లో టచ్ లో ఉంటున్నారట. ఇప్పుడు ఆయనే స్వయంగా ఎంట్రీ ఇచ్చి.. నేతలకు టాస్క్ లు అప్పగించారు. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది.. ఎక్కడెక్కడ నేతలు బలంగా లేరు.. తదితర సమాచారం ఇప్పటికే రెడీగా ఉంది. ఇప్పుడిక ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడమే ఆలస్యం. తననే ఇబ్బంది పెట్టాలని చూసిన కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ కొట్టడమే టార్గెట్. బీఎల్ సంతోష్ స్థాయి నేత స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో.. తెలంగాణ బీజేపీ నేతల్లో మరింత ఉత్సాహం పెరిగింది. అన్ని రకాల అండదండలు లభిస్తుండటంతో.. ఈసారి కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా రిటర్న్ గిఫ్టులు ఉంటాయని అంటున్నారు.