Remote Voting : దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. సొంత ఊరిలో ఓటు ఉండి వేరే ప్రాంతంలో నివసిస్తున్నా అక్కడ నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా సరికొత్త విధానాన్ని అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం రిమోట్ ఓటింగ్ పై ఈసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఓ కాన్సెప్ట్ నోట్ను సిద్ధం చేసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించింది. ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ ఈవీఎంను అభివృద్ధి చేశారు. జనవరి 16న ఈ నమూనా మిషన్ ప్రదర్శన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఈసీ ఆహ్వానించింది. రిమోట్ ఓటింగ్ను అమల్లో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం రాజకీయ పార్టీల అభిప్రాయాల కోరతామని ప్రకటించింది.
ఉద్యోగాలు, ఉపాధి కోసం సొంతూళ్లను వదిలి వేరే ప్రాంతాల్లో నివశించేవారు దేశంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో చాలామంది ఎన్నికల సమయంలో స్వస్థలాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ప్రయాణ ఖర్చులు దండగ అని చాలా మంది ఓటు కోసం ఊరు వెళ్లరు. అందువల్లే దేశంలో మూడోవంతు ఓటర్లు పోలింగ్కు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారు కూడా ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. దేశీయంగా వలసలు వెళ్లిన వారు ఉన్న చోటు నుంచే తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసేలా ‘రిమోట్ ఓటింగ్ మిషన్’ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ నమోదైంది. అప్పుడు 30 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటింగ్ తగ్గడానికి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కన్పిస్తోంది. విద్య, ఉద్యోగం ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. ఓటు వేయనివారిలో 85 శాతం మంది ఇలాంటి వారేనని ఈసీ ప్రకటించింది. వలసలు వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్పై దృష్టి పెట్టామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.