మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని మథురకు వెళ్లేందుకు ఓ కుటుంబం తమ 8 ఏళ్ల చిన్నారితో రైలెక్కింది. ఈ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కిటికీ దగ్గరున్న సీట్లలో కూర్చుకున్నారు. వెంటిలేషన్ కోసం కొందరు ప్రయాణికులు ఈ విండోను తెరిచారు. ఈ చిన్నారి ఉన్నట్టుండి కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. వెంటనే అలర్ట్ అయిన చిన్నారి తండ్రి తర్వాత వచ్చే రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీసులకు ఈ విషయం చెప్పాడు.
ఝాన్సీ జీఆర్పీ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి అర్థరాత్రి చిమ్మచీకట్లో గాలించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 కిలోమీటర్ల దూరం కాలినడకన గాలింపు చేపట్టారు. చివరికి పట్టాల పక్కన ఉన్న ఓ చెట్ల పొదల్లో చిన్నారి గాయాలతో కనిపించింది.
Also Read: ‘మంచి భవిష్యత్తు కోసం మరో ఉద్యోగంలో చేరుతున్నా.. నచ్చకపోతే తిరిగి వస్తా’.. వింత రాజీనామా వైరల్
స్పృహకోల్పోయి గాయాలతో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకపోతే ప్రాణాలతో మిగలడం కష్టం అనేలా చిన్నారి పరిస్థితి ఉంది. ఆస్పత్రికి వెళ్దామంటే అక్కడ నుంచి రోడ్డు మార్గం కూడా లేదు. దీంతో.. అటుగా వెళ్తున్న గూడ్స్ రైలును ఆపి వెంటనే లలిత్పుర్కు తరలించారు. వైద్యులు కూడా త్వరగా స్పందిండంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. యూపీ పోలీసులు ఈ మొత్తం వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో.. పోలీసులు రియల్ హీరోలంటూ పోల్చుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.