Skill Development Scam: ఏపీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. చంద్రబాబు సర్కార్ నుంచి ఎడాపెడా కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఫ్యాన్ పార్టీ. తెరపైకి స్కిల్ డెవలప్మెంట్ కేసు రావడంతో ఆ పార్టీ నేతలు కాసింత ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నైపుణాభివృద్ధిని ప్రొత్సహించేందుకు గతంలో టీడీపీ సర్కార్.. డిజైన్ టెక్ సిస్టమ్ కంపెనీ-సీమెన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లాయని ఆరోపిస్తూ గత వైసీపీ సర్కార్ హయాంలో సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ కేసు నేపథ్యంలో గతేడాది మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసింది జగన్ సర్కార్. దాదాపు 53 రోజుల తర్వాత ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. లేటెస్టుగా ఈ కేసులో గత టీడీపీ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థల ప్రతినిధులు నిధులను మళ్లించినట్టు గుర్తించింది ఈడీ. ఇందులో భాగంగా సీమెన్స్కు చెందిన ఆస్తులను అటాచ్ చేసింది.
ఢిల్లీ, ముంబై, పూణెలోని స్థిరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు వంటివి కలిపి మొత్తం 23.54 కోట్లను అటాచ్ చేసింది. ఈ కేసులో అప్పటి సీఎం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ అధికారులు ప్రస్తావించారు. ఇప్పటివరకు తాము చేసిన దర్యాప్తులో ఆయన పాత్ర ఎక్కడా కనిపించలేదని పేర్కొంది. దీంతో ఈ కేసు నుంచి ఆయన బయటపట్టారు.
ALSO READ: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఏప్రిల్ 5న ఏసీబీ కోర్టులో చంద్రబాబుతోపాటు ఇతరులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది సీఐడీ. సీమెన్స్ ప్రాజెక్ట్లో రాష్ట్రం పెట్టుబడి పెట్టిన నిధులను మళ్లించిందని, దీని ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేశాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయం తెల్సిందే.
వైసీపీ అధికారిక గెజిట్ వాదన మరోలా ఉంది. ఈ వ్యవహారాన్ని కాగ్ నిగ్గు తేల్చిందని రాసుకొచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో అధికారులు ఛార్జిషీటును దాఖలు చేశారని తెలిపింది. దానిని మార్చిలో ఈడీకి పంపినట్టు ప్రస్తావించింది. దీంతో ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్ను పడిందని రాసుకొచ్చింది.