BJP MP Laxman: పార్టీని నమ్ముకున్నవారికి ఏ పార్టీ అయినా ఛాన్స్ ఇస్తుంది. పదేళ్లుగా రూలింగ్లో ఉన్న బీజేపీలో పార్టీ నుంచి చిన్న పదవి ఇచ్చినా నేతలు ఫుల్ ఖుషీ అవుతారు. లేటెస్ట్గా తెలంగాణ బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్కు కీలక పదవి ఇచ్చింది బీజేపీ హైకమాండ్.
తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్. సమయం, సందర్భం తప్పితే పెద్దగా మీడియా ముందు కనిపించరు. కాంట్రవర్సీలకు దూరం, పార్టీకి లాయల్గా ఉంటారనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది. అదే ఆయన్ని అందలం ఎక్కిస్తోంది.
ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు డాక్టర్ లక్ష్మణ్. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కూడా. లేటెస్ట్గా కీలక బాధ్యతలను అప్పగించింది బీజేపీ హైకమాండ్. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ రిటర్నింగ్ అధికారిగా డాక్టర్ లక్ష్మణ్ను నియమించారు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.
ఈ మేరకు పార్టీ కార్యదర్శి అరుణ్సింగ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మణ్తోపాటు పార్టీ ఎంపీలు నరేశ్ బన్సల్, సంబిత్ పాత్ర, పార్టీ ఉపాధ్యక్షురాలు రేశా వర్మ సహా ఎన్నికల అధికారిగా హైకమాండ్ నియమించింది.
ALSO READ: మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?
బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసిన నేతల ఆధ్వర్యంలో ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే పార్టీలో కీలకమైన పదవిగా కొందరు భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతల్లో ఈ స్థాయిలో పదవులు అందుకున్న నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో డాక్టర్ లక్ష్మణ్ కూడా ఒకరనే చెప్పాలి.
మోదీ 3.0 కేబినెట్లో డాక్టర్ లక్ష్మణ్కు మంత్రి పదవి వస్తుందని జోరుగా వార్తలొచ్చాయి. అయితే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. చివరకు పార్టీని నమ్ముకున్న నేతలకు పార్టీలో పదవులు అప్పగిస్తోందని అంటున్నారు తెలంగాణ కమలనాధులు.
డాక్టర్ లక్ష్మణ్కు పదవి ఇవ్వడానికి కారణాలు చాలానే ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఉత్తరాదిలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో సౌత్లో వున్న కొందరి నేతలకు కీలక పదవులు ఇస్తోందని అంటున్నారు.
తమిళనాడు, కేరళకు చెందిన నేతకు మోదీ కేబినేట్లో చోటు కల్పించిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టిందనే చెప్పవచ్చు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకున్న రాష్ట్రాల్లో ఏదైనా బీజేపీకి ఉందంటే.. అది కేవలం తెలంగాణ మాత్రమేనని చెప్పాలి. నిన్నటి ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచిన విషయం తెల్సిందే.