Chennai Floods: చినుకులు రాలితే చిందేసే రోజులు పోయాయా.. చిందులు అటుంచితే ప్రాణాలు గుప్పిట్లో బ్రతికే రోజులు వచ్చాయా.. ఔను అంటున్నారు చెన్నై నగర వాసులు. పాపం ఈ నగరానికి వర్షం అంటే అంత భయమే. చినుకులు అలా రాలుతుంటే చాలు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎవరైనా వీరి తరువాతే. ఎందుకంటే వీరికి ఉన్న అనుభవాలు అటువంటివి. అందుకే కాబోలు తాజా భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. వర్షపుపోటు మాత్రం చెన్నైని వదిలేలా లేదు. భారీ ఈదురు గాలులు.. వర్షాలు.. నగరాన్ని అతలాకుతలం చేశాయని చెప్పవచ్చు. కానీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నగర వాసులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడుకు కూడా 18వతేదీ వరకు భారీ వర్షసూచన ఉన్నట్లు ఐఎండి ముందుగానే ప్రకటించింది. కానీ ఏపీలో ఈసారి విజయవాడ వరదలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త పడి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. ఇక చెన్నై లో వర్షాల జోరు చూస్తే.. చినుకు.. చినుకు రాలుతూ భీకర గాలులతో పాటు.. భారీ వర్షం కురుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా చెన్నైలో పాఠశాలలకు మూడు రోజులు సెలవులు కూడా ప్రకటించేశారు.
చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
భారీ వర్షాల దృష్ట్యా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్న ఉదయనిధి@Udhaystalin #ChennaiRains #Chennai #udayanidhistalin #Bigtv https://t.co/6w1otOpQeW pic.twitter.com/ZEbGoocupY
— BIG TV Breaking News (@bigtvtelugu) October 15, 2024
గత వరదలను దృష్టిలో ఉంచుకున్న చెన్నై వాసులు ఈసారి తమకంటే.. తమ వాహనాల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చారని చెప్పవచ్చు. దీనికి కారణం చెన్నైలో ఏ వంతెన చూసినా వాహనాలతో నిండిపోయింది. గృహాల వద్ద పార్కింగ్ చేస్తే.. వాహనాలు మునిగిపోతాయి.. అసలే కష్టకాలం.. మళ్లీ వాహనాల మరమ్మతులకు డబ్బులు ఎట్లా తెచ్చేది అనుకున్నారో.. ఏమో కానీ భారీ వంతెనలపై పార్కింగ్ చేసేశారు. పోలీసులు ఇదే అదునుగా భావించి జరిమానాలు విధించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు ఇంటి బయట ఉండాల్సిన బైక్స్.. భారీ వర్ష సూచనతో గృహాలలోకి అంటే బెడ్ రూమ్ లలోకి కూడా చేరాయి. దీనికి కారణం బైక్స్.. వరదలో కొట్టుకుపోకుండా కాపాడుకోవడమే అయినప్పటికీ.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా చెన్నైలో అంతకంతకు పెరుగుతున్న వర్షాల ధాటికి చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురానికి రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. అయితే చెన్నైలో మాత్రం భీకర గాలుల ధాటికి కరెంట్ వైర్లు పలుచోట్ల యమపాశాలుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా తెగిపడ్డ విద్యుత్ తీగలకు తగిలి కరెంట్ షాక్తో ఐదు ఆవులు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. సత్యమూర్తినగర్, టి.నగర్లో కరెంట్ వైర్ల వల్ల తృటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. కాగా వేలచేరిలో వర్షాల ధాటికి వేలాది గృహాలు నీట మునగగా, ప్రభుత్వ ఆదేశాలతో రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతోంది.
రానున్న 24 గంటలు కూడా చెన్నైకి వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ అల్పపీడనం చెన్నై-నెల్లూరు మధ్య ఈ నెల 17న తుఫాన్ తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నై మాత్రం వర్షాల ధాటికి ఛిధ్రం అవుతున్న పరిస్థితి కనిపిస్తుండగా.. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కల్పించే చర్యల్లో బిజిబిజీ అయ్యారు. అలాగే చెన్నైలో భారీ వర్షాల దృష్ట్యా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లో ఉంటూ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వరద సహాయక చర్యలకు ఆదేశాలు ఇస్తూ.. వరదల నష్ట నివారణ చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.