New Blood Test: అల్జీమర్స్ వ్యాధికి కొత్త రక్తపరీక్షను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త రక్త పరీక్ష ద్వారా లక్షణాలు బయటకు కనిపించకపోయినాసరే వ్యాధిని నిర్ధారించే అవకాశం ఉందంటున్నారు లండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒస్కార్ హస్సన్, యూనివర్సిటీ ఆఫ్ గోతెన్ బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాజ్ బ్లెనో. వీరు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టారు. ఈ ఇద్దరి నేత్రుత్వంలోని పరిశోధకుల టీం 575 మంది రక్త పరీక్షలను విశ్లేషించింది. అల్జీమర్స్ వ్యాధి పాథాలజీని గుర్తించడంలో సరిపోయే మల్టిఫుల్ బ్లడ్ బయోమార్కర్లను కనుగొన్నారు. దాదాపు 242 మందిలో కాగ్నిటివ్ టెస్టింగ్, మాగ్రెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ తోపాటు ప్లాస్మా పరీక్షలను ఆరేళ్లపాటు చేపట్టారు. ఈ ఆరేళ్లలో శాస్త్రవేత్తలు ఫాస్పో-టౌ 217 మాత్రమే ఆల్జీమర్స్ వ్యాధి పాథాలజీకి సంబంధించిందని కనుగొన్నారు. ఈ రీసెర్చ్ కి సంబంధించిన విషయాలను నేచర్ మెడిసిన్ జర్నల్ ప్రచురించింది. సైంటిస్టులు కనుగొన్న ఈ కొత్త రకం రక్త పరీక్ష ఆల్జీమర్స్ లక్షణాలు కనిపించని వారిలోనూ వ్యాధి నిర్దారణకు ఉపయోగపడనుంది.
ఇంతకీ ఆల్జీమర్స్ అంటే ఏంటి?
మతిమరుపు కంటే భయంకరమైన వ్యాధి ఆల్జీమర్స్. మతిమరుపుతో ప్రారంభమై కాలం గడిచే కొద్దీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే మెదడుకు ఇక పెద్ద సమస్యే. దీని వల్ల బాధితులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. ఒకప్పుడు వయసు మళ్లినవారిలోనే కనిపించేది. కానీ ఇప్పుడది 30 ఏళ్లు దాటినవారిలోనూ కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆల్జీమర్స్ సోకినవారిలో మతిమరుపు ఎక్కువ. అందుకే వారేం చేస్తారో వారికే తెలియదు. గుర్తుండదు కూడా. స్వల్పంగా జ్నాపక శక్తిని కోల్పోవడం మొదలు సంభాషణలను కొనసాగించే సామర్థ్యం కోల్పోవడం దాకా ఎన్నో లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. ఈ వ్యాధికి మెరుగైన చికిత్స కనుగొనడానికి వరల్డ్ వైడ్ గా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.