Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖతో పాటు ప్రోటోకాల్ అధికారులపై మండిపడుతున్నారు. కేంద్రం నిధులతో ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు, హోర్డింగ్’ల్లో ప్రధాని మోదీ ఫోటో లేకపోతే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో అధికారులకు హితబోధ చేశారు.
పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఫ్లెక్సీలు, వాల్ పెయింట్లపై ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆయా శాఖ అధికారులు ప్రధాని ఫోటో లేకుండా కేవలం సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్ ఫోటోలను మాత్రమే ప్రచురించారు. దీంతో ఈ విషయం ఉప ముఖ్యమంత్రి జనసేనాని దృష్టికి వచ్చింది.
వాటన్నింటిలో మోదీ ఫోటో తప్పనిసరి…
పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన తప్పనిసరిగా ప్రధాని మోదీ, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలు ఉండాలన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం, పంచాయతీరాజ్ శాఖ లోగో, ఉపాధి హామీ పథకం లోగో ఉండేలన్నారు.
పర్యవేక్షణకు పవన్ ఆదేశాలు…
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యక్రమాల్లో ఈ ప్రోటోకాల్ పాటించి తీరాలన్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం ఈ మేరకు పర్యవేక్షణ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాలు జారీ చేశారు.
నిర్లక్ష్యంగా మారిన అధికారుల తీరు…
మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వాల్ పోస్టర్స్, హోర్డింగ్లు సిద్ధం చేసే సందర్భంలో అధికారులు ఒకటికి నాలుగైదు సార్లు పునపరిశీలన చేసుకుంటుంటారు. యాడ్ రెఢీ అయ్యాక సంబంధిత శాఖ కమీషనర్ లేదా డైరెక్టర్ ఓకే చేస్తారు. అనంతరమే రిలీజ్ అవుతుంది.
పొరపాటా వలేక తప్పిదమా…
కానీ ఏపీ పంచాయతీ రాజ్ కు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో హోర్డింగ్స్ విడుదల చేసే సమయంలో ఏకంగా ప్రధాని మోదీనే విస్మరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనుకోకుండా జరిగిన తప్పుగా గుర్తించాలా లేక కావాలనే మోదీ ఫోటో లేకుండా చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
గతంలోనూ ఇవే తప్పులు…
ఉమ్మడి ఏపీ విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ, 2019లో వైసీపీ హయాంలోనూ ఇలాంటి పొరపాట్ల కనిపించాయి. కేంద్ర నిధులతో చేపట్టిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడం పట్ల రాష్ట్ర బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ లాంటివాళ్లు విమర్శించేవారు.
కేసీఆర్’ది సైతం అదే బాట…
ఇదే సమయంలో టీడీపీ, బీజేపీలు ఈ ప్రోటోకాల్ అంశంలో ఇబ్బందులు పడ్డారు. ఇక తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. కేంద్ర నిధులతో చేపట్టే కార్యక్రమాల్లో ప్రధాని ఫోటో ఎందుకు లేదంటూ సాక్షాత్తు భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కామారెడ్డిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్పటి సీఎం కేసీఆర్ సైతం స్పందించారు. ఇది చాలా చిన్న విషయమని, దీనిపై ఓ కేంద్రమంత్రికి ఎందుకు అంత అత్యుత్సాహం అంటూ కొట్టిపరేశారు కేసీఆర్.
తాజాగా ఏపీలో ప్రభుత్వ అధికారులు కీలకమైన ప్రధాని మోదీ ఫోటో లేకుండా చేయడం పట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నట్లు జనసైనికులు సైతం భావిస్తున్నారు.
Also read : రైతులను బలి తీసుకుంటున్న ఏనుగులు.. పవన్ ఇచ్చిన ఆ మాట ఏమైనట్లు?