Maharashtra, Jharkhand Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జార్ఖండ్ లో రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 13, 20 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వివరించారు. అదేవిధంగా నవంబర్ 23న ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నట్లు రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
Also Read: స్కూల్స్, కాలేజీలకు రేపు సెలవు… కారణం ఇదే
మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ఇదే…
అక్టోబర్ 22 – ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్
అక్టోబర్ 29 – నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
అక్టోబర్ 30 – నామినేషన్ల పరిశీలన
నవంబర్ 4 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
నవంబర్ 20 – పోలింగ్
నవంబర్ 23 – ఓట్ల లెక్కింపు
జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే…
రెండు విడతల్లో జార్ఖండ్ లో ఎన్నికలు
తొలి విడతలో…
అక్టోబర్ 18 – ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 25 – నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
అక్టోబర్ 28 – నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 30 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
నవవంబర్ 13 – పోలింగ్
రెండో విడతలో…
అక్టోబర్ 22 – ఎన్నికల నోటిఫికేషన్
అక్టోబర్ 29 – నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
అక్టోబర్ 30 – నామినేషన్ల పరిశీలన
నవంబర్ 1- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
నవవంబర్ 20 – పోలింగ్
నవంబర్ 23 – ఓట్ల లెక్కింపు
Also Read: ఈసారి దిల్లీలో టపాసులు అమ్మినా, కొన్నా, కాల్చినా అంతే సంగతులు…ప్రభుత్వం కీలక ఆదేశాలు
‘మహారాష్ట్రలో మొత్తం 36 జిల్లాలు ఉన్నాయి. అందులో 288 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 234 జనరల్, 29 ఎస్సీ, 25 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4.97 మంది పురుష ఓటర్లు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 20.93 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం మహారాష్ట్రలో 1,00,186 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు’ అని రాజీవ్ కుమార్ తెలిపారు.
‘జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 24 జిల్లాలు ఉన్నాయి. అందులో 81 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 44 జనరల్, 9 ఎస్సీ, 28 ఎస్టీ నియోజవర్గాలున్నాయి. జార్ఖండ్ లో మొత్తం 2.6 కోట్ల ఓటర్లు ఉన్నారు. వారిలో 1.29 కోట్ల మహిళా ఓటర్లు ఉన్నారు. 1.31 కోట్ల పురుష ఓటర్లు ఉన్నారు. 66.84 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. కాగా, 11.84 లక్షల మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు’ అని ఎన్నికల ప్రధాన కమిషనర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. నవంబర్ 26తో మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్నది. అదేవిధంగా జనవరి 5తో జార్ఖండ్ ప్రస్తుత అసెంబ్లీ గడవు కూడా ముగియనున్నది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నది.
ఆయా రాష్ట్రల్లో నేతలు ఇప్పటికే సంసిద్ధమయ్యారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సమరంలో ముమ్మరంగా పాల్గొని తమ గెలుపు ఓటములను పరీక్షించుకునేందుకు పార్టీలు, నేతలు ప్రణాళికలు చేసుకుంటున్నారు.