CM Revanth Reddy Delhi Programme : సీఎం రేవంత్రెడ్డి రేపు దిల్లీ బాటపట్టనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ పెద్దలతో కీలక చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ విస్తరణపై పార్టీ అగ్రనేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. మరోవైపు గురువారం దిల్లీలో అత్యంత కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈ భేటీలో పాల్గొన్ననున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం దిల్లీ వెళ్తున్నారట. దీంతో మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు రేపటి సమావేశంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 10 నెలలు గడిచిపోతోంది. అయితే చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ఈసారి సాధించుకువస్తారని తెలుస్తోంది. గత డిసెంబర్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పట్నుంచి నేటివరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ విషయంపై దిల్లీలోని అధిష్ఠానంతో మాట్లాడేందుకు రేవంత్రెడ్డి ఇప్పటికే చాలాసార్లు హస్తినలో పర్యటించారు.
మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై హైకమాండ్తో చర్చించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజాగా హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలకు ముందే తెలంగాణ క్యాబినెట్ను విస్తరించాలని పార్టీ పెద్దలు ఆశించారు. కానీ ఆా రాష్ట్రాల్లో ఎన్నికలపైనే కాంగ్రెస్ అగ్రనేతలు దృష్టి కేంద్రీకరించడంతో క్యాబినెట్ విస్తరణ సాధ్యం కాలేదు. దీంతో రేపటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి రేవంత్రెడ్డి హాజరవుతున్నారు. అనంతరం ప్రత్యేకంగా సోనియా, రాహుల్, ఖర్గేలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణపై చర్చించనున్నారట. ఫలితంగా కొత్త మంత్రుల జాబితాతోనే తెలంగాణకు తిరిగు పయనమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.