Children Myopia Problems: ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చేతిలో సెల్ ఫోన్ లేకుంటే అల్లాడిపోతున్నారు. తల్లిదండ్రులు వారికి చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. పిల్లలు ఏడిస్తే చాలు, చేతిలో ఫోన్ పెట్టి ఊరుకోబెడుతున్నారు. అన్నం తినిపించేటప్పుడు మొదలుకొని, పడుకునే వరకు సెల్ ఫోన్ లో కిడ్స్ వీడియోలు పెట్టి ఇచ్చేస్తున్నారు. కానీ, చిన్న పిల్లలు ఎక్కువ సేపు ఫోన్ చూడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. సెల్ ఫోన్ కారణంగా స్కూల్ ఏజ్ పిల్లల్లో మయోపియా పెరుగుతున్నట్లు వెల్లడించారు.
పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం
ఎక్కువ సేపు సెల్ ఫోన్ చూడటం వల్ల పిల్లల్లో లెర్నింగ్, డెవలప్ మెంట్ మీద తీవ్ర ప్రభావం పడుతున్నట్లు ఢిల్లీ AIIMSలోని రాజేంద్ర ప్రసాద్ సెంటర్ చీఫ్ డాక్టర్ JS తిత్యాల్ వెల్లడించారు. పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం మానకుంటే భవిష్యత్తులో కంటిచూపు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వీలైనంత వరకు సెల్ ఫోన్ కు దూరంగా ఉంచి, బయట ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలన్నారు. తమ దగ్గరికి వచ్చే పిల్లల్లో 30 శాతం మంది మయోపియా(షార్ట్ సైట్)తో బాధపడుతున్నారని వెల్లడించారు. ఈ సమస్య మరింత తీవ్రం కాకముందే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని ఆయన సూచించారు.
సెల్ ఫోన్ తో పిల్లల్లో చాలా సమస్యలు
పిల్లల్లో మయోపియా అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ గా మారిందని ఢిల్లీ AIIMSలోని రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ప్రొఫెసర్ రోహిత్ సక్సేనా అన్నారు. ఈ వ్యాధి కారణంగా పిల్లల్లో కంటి అలసట, నొప్పి, ఏకాగ్రత కోల్పోవడం, నిద్రలేమి, తలనొప్పి, చిరాకుతో సహా పలు ఇబ్బందులు కలుగుతాయన్నారు. ఈ సమస్యలు పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
ఎదిగే రెటీనాపై తీవ్ర ప్రభావం
2 నుంచి 3 ఏండ్ల పిల్లల్లో రెటీనా అభివృద్ధి చెందే దశలో ఉంటుందని చెప్పారు సెంటర్ ఫర్ సైట్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ మహిపాల్ సింగ్ సచ్దేవ్. ఈ వయసులో పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలకు కంటి ముప్పు తప్పదన్నారు. “చిన్న పిల్లలు సహజంగానే సెల్ ఫోన్లు, టీవీలకు ఆకర్షితులవుతారు. ఎక్కువ సేపు సెల్ ఫోన్లు, టీవీలు చూడటం వల్ల 70% రెటీనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వారికి చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్ దూరంగా ఉంచాలి. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలి. సెల్ ఫోన్ ఇవ్వడం తగ్గించి బయట ఆడుకోవడం ప్రోత్సహించాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారు”అని వెల్లడించారు.
కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులలో కంటి చూపు సమస్యలు పెరిగినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతి ముగ్గురు చిన్నారులలో ఒకరికి మయోపియా లక్షణాలు ఉన్నట్లు తెలిపాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే పిల్లలు కనీసం రెండు గంటల పాటు బయట ఆడుకునేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.
Read Also: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?