వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. అదే జరిగితే అడవులు, గాలి, భూగర్భజలాలు కలుషితమవుతాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదన.
కేసీఆర్ హయాంలోనే 44 జీఓ జారీ…
కానీ ఆ పార్టీ నేతలు చెబుతున్నట్లు ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే పట్టాలెక్కిందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే విషయాన్ని జీఓఎంఎస్ 44ను అడిగితే తెలుస్తుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. 2017 డిసెంబర్12న పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా అప్పటి సర్కార్ ఉత్తర్వులు సైతం జారీ చేసిందట.
ఫైల్ పక్కన పెట్టిన కేసీఆర్…
వికారాబాద్ జిల్లాలోని దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటుపై బీఆర్ఎస్ నిరసనల వేళ సదరు పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవలే వివరణ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం నేవీ రాడార్ కోసం అన్ని అనుమతులను ఇచ్చేసిందన్నారు. చివరిగా సంతకం పెట్టాల్సిన చోట తమకు బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వాలని కేసీఆర్ సదరు ఫైల్ ను పక్కనపెట్టేశారని గుర్తుచేశారు.
అక్కడ లేని ఇబ్బంది తెలంగాణలో ఎందుకు : సురేఖ
అయితే రాడార్ స్టేషన్ కేంద్రానికి సంబంధించిందన్న మంత్రి, తమిళనాడులో 30 ఏళ్ల నుంచి నేవీ రాడార్ ను కేంద్రం నిర్వహిస్తోందన్నారు. అయినా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదన్నారు. మరోవైపు నేవీ వల్ల పరిగిలో కేంద్రీయ విద్యాలయాలు, నేవీ స్కూల్స్ సైతం వస్తాయన్నారు. నేవీ ప్రాజెక్టు వల్ల ఎవరికీ హానీ కలగదన్నారు మంత్రి కొండా సురేఖ. నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం 2,900 ఎకరాలను తెలంగాణ అటవీశాఖ నేవీకి అప్పగించింది.
రేపు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాక…
ఇదే సమయంలో ఈ నెల 15న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి సీఎం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
మరోవైపు అధికార యంత్రాంగం శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. దామగుండం అటవీ ప్రాంతంలో విఎల్ఎఫ్ ( వెరీ లో ఫ్రీక్వెన్సీ ) స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం కేంద్ర నావికాదళ అధికారులతో కలిసి పరిశీలించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి తొలుత హైదరాబాద్ నుంచి హెలికాప్టరులో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గాన బేకుల బీట్ తండా సమీపంలోని పైలాన్ వద్ద కు చేరుకుంటారు. అక్కడ నేవీ రాడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
కేటీఆర్ వాదన ఏంటంటే ?
దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఓవైపు మూసీ సుందరీకరణ చేస్తామంటూనే మరోవైపు అదే మూసీకి మరణశాసనం రాస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ప్రయోజనాలను ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని నిలదీశారు. మూసీ నది పురుడు పోసుకున్న చోట 12 లక్షల చెట్ల నరికివేతతో కోలుకోలేని అనర్థం జరుగుతుందన్నారు.
జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. గంగా నదికి ఓ న్యాయం, మూసీ నదికి మరో న్యాయమా అని అంటున్నారు. రాడార్ స్టేషన్ నిర్మాణానికి తమ 10 ఏళ్ల పాలనలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదన్నారు. పర్యావరణవేత్తలను కూడగట్టుకుని బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామన్నారు.
Also read : మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన