TPCC President Mahesh Kumar Goud : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కైవసం చేసుకోబోతుందని ఆ పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు బీగ్ టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
వాళ్లకు అర్హత లేదు…
గత పదేళ్లలో యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీ చేసే అర్హతే లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగలిచ్చామన్నారు. ఇక హైడ్రా, మూసి ప్రక్షాళన సైతం నిరంతరంగా కొనసాగుతాయని తనతో పాటు ఎవరున్నా ఆ విషయంలో చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు.
హైడ్రా లేకుంటే మరో వయనాడ్…
హైడ్రా అంశంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేదిలేదన్న మహేశ్, మూసి ప్రక్షాళన మీద కేటీఆర్, హరీష్, కిషన్ రెడ్డిలు చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైడ్రాను ఆపేస్తే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు అక్రమంగా అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాకో యంగ్ ఇండియా కాలేజీ…
ఇక నిజమాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న మహేశ్ గౌడ్, దదసరా కానుకగా జిల్లాకు త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాల మంజూరు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మ్యానిఫెస్టోలో లేని హామీలను సైతం ఇస్తున్నామని, నీళ్లు , నిధులు, నియామకాల కోసం యూపీఏ తెలంగాణ ఇచ్చిందన్న టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50 వేల వరకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లు పనిచేసినా కనీసం 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, రుణ మాఫీపైనా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ఖజానా ఖాళీ…
పదేళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత, 9 నెలల్లో కాంగ్రెస్ చేసిన రుణమాఫీ ఎంతో చూడాలన్నారు. కాంగ్రెస్ వచ్చేటప్పటికే రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నం అయిపోయిందని, అయినా అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సోషల్ సెన్స్ లేకుండా సోషల్ మీడియాని వాడుతోందన్నారు. ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, అవి తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలికంగా వాళ్ల పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై త్వరలోనే సీఎంతో చర్చిస్తామన్నారు. ప్రాణహిత 20, 21వ ప్యాకేజీ పనులను పరుగులు పెట్టిస్తామన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల అవసరం ఉందని, ఇందూరులో మంచి స్టేడియం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
మోదీ పట్టించుకోవట్లేదు…
కేంద్రంలోని బీజేపీతో బీఆర్ఎస్ జట్టుకట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆర్ఓబీకి సంబంధించి ప్రధాని మోదీ, కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. నిజామాబాద్ నగరం స్మార్ట్ సిటీగా మారాలని, ఈ మేరకు ఎంపీ అరవింద్ కృషి చేయాలన్నారు.
త్వరలోనే క్యాబినెట్ విస్తరణ…
వీలైనంత త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పేదలను మోసగిస్తే సహించబోమన్నారు. బాన్సువాడ, వరంగల్, పరకాల లాంటి ప్రాంతాల్లో నేతల మధ్య విభేదాలను సరిదిద్దుతామన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్న ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి గులాబీలకు, కమలనాథులకు లేదన్నారు. త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు అందిస్తామన్నారు.
Also Read : పక్కా వ్యూహంతోనే లోకల్ ఫైట్ బరిలోకి: మహేష్ కుమార్ గౌడ్