Musi Case in High Court : మూసీ రివర్ బెడ్ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇళ్లు, కట్టడాలపై అధికారులు మార్కింగ్ చేయటంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎక్కడ తమ ఇళ్లను యంత్రాంగం కూలగొడుతుందోనని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దశాబ్దాలుగా ఈ ఇళ్లలోనే తాము నివాసం ఉంటున్నామని, ఇప్పుడు అవి కూలగొడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మూసీ రివర్ బెడ్ పిటిషన్లపై రేపు, మంగళవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
తొలి దశ పూర్తైంది…
మూసీ సుందరీకరణలో భాగంగా తొలి దశలో నదీలో నిర్మించిన ఇళ్లను కూల్చాలని గతంలోనే సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటి వరకు దాదాపుగా 150 ఇళ్లను కూల్చారు. మరో 2,166 నిర్మాణాలు కూల్చివేతలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఫలితంగా హైదరాబాద్ మూసి నది పరివాహక ప్రాంతాల్లో మిగిలిపోయిన ఇళ్లను కూల్చే ప్రక్రియను మంగళవారం నుంచే మొదలుపెట్టనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
రెండో దశ రేపట్నుంచే…
గత పది రోజులుగా దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా కూల్చివేతలకు ప్రభుత్వం బ్రేక్ ఇచ్చింది. ఇక రేపటి నుంచి మళ్లీ పనులను పట్టాలెక్కించనుంది. మూసీ సుందరీకరణలో భాగంగా మొదటి దశలో నదీ గర్భంలోని ఇళ్లను కూల్చాలని గతంలోనే నిర్ణయించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇళ్లకు ఇప్పటికే అధికారులు మార్కింగ్ సైతం పూర్తి చేశారు.
రంగం సిద్ధం…
ఇప్పటికే నిర్వాసితులను అక్కడ్నుంచి ఖాళీ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. అక్కడ్నుంచి వెళ్లని వాళ్లకు త్వరలోనే ప్రత్యామ్నాయం చూపిస్తామని అధికారులు అంటున్నారు. మరోవైపు స్థానికులకు ఏ ఇబ్బంది రాకుండా రేపటి నుంచి కూల్చివేతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారట.
అధికారుల ‘మార్కింగ్’…
రెండో దశలో నదీలోని ఇళ్లను కూల్చివేయడం సహా బఫర్ జోన్లోని నిర్మాణాలకు రెడ్ మార్క్ వేస్తున్నారట. ఇందుకు సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అధికార వర్గాల ద్వారా సమాచారం.
Also Read : మనసులోని మాటకు.. సమయం ఆసన్నమైందా.. ఇంతకు మల్లారెడ్డి మదిలో ఏముంది ?