హైదరాబాద్, స్వేచ్ఛ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని కుటుంబసభ్యులు మౌలాలిలోని ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లగా ఆయనకు నిరసన సెగ తగిలింది. ప్రజా సంఘాల నేతలు కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ నినదించారు. సాయిబాబా పదేళ్లు జైల్లో ఉంటే బీఆర్ఎస్ ఏం చేసిందని నిలదీశారు. ఈరోజు నివాళులు అర్పించేందుకు ఎలా వచ్చారని అడిగారు. బీఆర్ఎస్ హయాంలో 150 మందిపై అకారణంగా ఉపా కేసులు పెట్టారని గుర్తు చేశారు. హరగోపాల్, కోదండరాం, విమలక్కను వేధించారని మండిపడ్డారు. డౌన్ డౌన్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు ప్రజా సంఘాల నేతలు.
Also Read: కేటీఆర్ పరువు నష్టం దావా కేసు.. విచారణ.. తాజా అప్ డేట్ ఇదే
ఇటు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా సాయిబాబా పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వందమందికి శిక్ష పడినా, ఒక నిర్దోషికి పడొద్దు అనే న్యాయ సూత్రం సాయిబాబాకు వర్తిస్తుందని అన్నారు. నిర్దోషిగా బయటకు వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చే సమయంలో ఇలా జరగడం భాదకరమని చెప్పారు. సాయిబాబా జీవితం మొత్తం ప్రజా సేవకే అర్పించారని కొనియాడారు హరీష్ రావు. వైకల్యం కారణంగా జీవితం మొత్తం కుటుంబ సహకారంతోనే గడిపినప్పటికీ ప్రజా ఉద్యమాన్ని ఆపలేదని చెప్పారు. నిరాధారమైన కేసులో ఏళ్ళ తరబడి జైల్లో గడపాల్సి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వాల కుట్ర సాయిబాబా జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసిందన్నారు. అవయవదానం చేయడమే కాకుండా శరీరాన్ని గాంధీ హాస్పిటల్కు దానం చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. సాయిబాబా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు హరీష్ రావు.