IAS OFFICERS PETITONS IN CAT : తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల బదిలీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అత్యున్నత సర్వీస్ కు చెందిన అధికారులు బదిలీ కావాల్సి ఉంది. కానీ ఆయా అధికారులకు అంతరాష్ట్ర బదిలీలు ఇష్టం లేనట్టుంది.
రేపే వీటిపై విచారణ…
దీంతో కేంద్రం తరఫున డీఓపీటీ ఇటీవలే జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని, తమను తమకు నచ్చిన రాష్ట్రాల్లోనే కొనసాగించాలని, ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామంటున్నారు. ఈ మేరకు సోమవారం పలువురు ఐఏఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రైబున్యల్ ను ఆశ్రయించారు. రేపు వీటిపై విచారణ జరగనుంది.
ఎవరెవరు ఏ రాష్ట్రానికి తెలుసా…
తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్లు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతిలతో పాటు ఇక ఐపీఎస్ కేడర్కు చెందిన అంజనీ కుమార్, అభిలాశ్ బిస్త్, అభిషేక్ మహంతిలను కేంద్రం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు అలాట్ చేసింది.
మరోవైపు సృజన, శివశంకర్, హరికిరణ్లను ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇంకోవైపు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తామన్న ఎస్.ఎస్.రావత్, అనంతరాము అభ్యర్థనలను కేంద్రం రద్దు చేసింది. దీంతో ఏపీ క్యాడర్ లోనే వీరిద్దరూ కొనసాగుతున్నారు.
తెలంగాణ వద్దంటున్న సృజన…
తెలంగాణ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి ఇక ఏపీ నుంచి సృజన పిటిషన్లు దాఖలు చేశారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ( డీఓపీటీ ) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.
తమకు మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నలుగురు ఐఏఎస్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మంగళవారం సదరు పిటిషన్లపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
సీఎస్ శాంతికుమారితో చర్చలు…
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో నలుగురు ఐఏఎస్లు సమావేశమయ్యారు. దీనిపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపాక క్యాట్ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
అంతా మహిళామణులే…
మరో విషయం ఏంటంటే క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులంతా మహిళలే కావడం గమనార్హం. తెలంగాణ నుంచి ముగ్గురు అధికారిణులు కాగా ఏపీ నుంచి సృజనతో కలిపి మొత్తం నలుగురు మహిళా ఆఫీసర్లు పిటిషన్లు దాఖలు చేయడం కొసమెరుపు.
ఖండేకర్ కమిటీల సిఫార్సుల మేరకు…
ఉమ్మడి ఏపీ విభజన సమయం 2014లో అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కేంద్రం విభజించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలను కేటాయించింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ. దీంతో కొందరు కేంద్రం ఆదేశాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీఓపీటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అధికారులు తమకు కేటాయించిన సొంత క్యాడర్ లోనే కొనసాగాలని ఉత్తర్వులను విడుదల చేసింది.
దీన్ని 2014లోనే కొందరు అధికారులు క్యాట్ లో సవాల్ చేశారు. విచారించిన క్యాట్ 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో క్యాట్ తీర్పును కేంద్రం (డీవోపీటీ) 2017లో సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును పిటిషన్ వేసింది.
అనంతరం 2023 మార్చిలో విచారణ చేపట్టిన న్యాయస్థానం అధికారుల అభ్యర్థనను పరిశీలించేందుకు దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిషన్ను 2024 మార్చి 21న ఏర్పాటు చేయించింది. ఈ మేరకు ఐఏఎస్, ఐపీఎస్ అభ్యర్థనలను పరిశీలించింది. అనంతరం వారి అభ్యర్థలను తిరస్కరించింది. కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 16లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని సైతం ఆదేశించింది. తాజాగా నేడు పలువురు అధికారులు డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్ని ఆశ్రయించారు.
Also Read : ఏపీలో మళ్లీ వర్షాలు…! జనాల సెల్ఫోన్లకు మెసేజ్లు…