CM Chandrababu Review meeting with officials on Rains: ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు తాజాగా కీలక విషయాన్ని వెల్లడిస్తూ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురువనున్నాయని చెప్పారు. ఇటీవలే భారీగా కురిసిన వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు, సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సూచించారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వర్షాలపై సోమవారం సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వారికి మొబైల్ ఫోన్ల ద్వారా మెసేజ్ లు పంపి అలర్ట్ చేయాలన్నారు.
Also Read: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అనూహ్యం… కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు
వర్షాల నేపథ్యంలో ఇటు అధికారులు కూడా హై అలర్ట్ గా ఉండాలని సూచించారు. అందులో భాగంగా చెరువు కట్టలు, కాలువలపై నిరంతరం ఫోకస్ పెట్టాలన్నారు. వర్షాల నేపథ్యంలో వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ విధంగా అలర్ట్ గా ఉండి వర్షాల వల్ల ఎటువంటి నష్టం కలగకుండా చూడాలన్నారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, ఇతర అవసరమైన చోట కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ లకు ప్రజల నుంచి వచ్చే వినతులపై అధికారులు వేగంగా స్పందించాలన్నారు.
నెల్లూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని చెప్పారు. ఈ క్రమంలో ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు.
Also Read: కూటమిలో అప్పుడే.. మంత్రి దుర్గేష్ను నిలదీసిన టీడీపీ నేతలు, ఎందుకు?
ఇదిలా ఉంటే.. ఇటీవలే ఏపీలో భారీగా వర్షాలు కురిసాయి. దీంతో వరదలు పెద్ద ఎత్తున ప్రవహించి ప్రాణనష్టం, ఆర్థిక నష్టం తీవ్రంగా వాటిల్లింది. పలువురు మృత్యవాతపడ్డారు. ఆ సమయంలో పది రోజులపాటు విజయవాడ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. పదిరోజుల పాటు వరద బాధితులను ఆదుకుంది. వారికి ఆహారం, నీళ్లు, పాలు అందించింది. సహాయక చర్యలను ముమ్మరం చేసి అధిక ప్రాణనష్టం కలగకుండా చూసింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించింది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వరద సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు వచ్చి ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసిన విషయం తెలిసిందే.