Pawan Kalyan angry on Jagan: మాజీ సీఎం జగన్పై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ ఐదేళ్ల పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలీని పరిస్థితి ఉందన్నారు. చివరకు అధికారులు ఎవరో తెలీని పరిస్థితి నెలకొందన్నారు.
ఆ నిధులన్నీ ఎక్కడని ప్రశ్నించారు. ఎలా తీసుకున్నారో.. ఎక్కడ ఖర్చు చేశారో ఎవరికీ తెలీదన్నారు పవన్. ఎన్నిసార్లు రివ్యూ చేసినా ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో తెలీయని పరిస్థితి ఉందన్నారు. సింపుల్ చెప్పాలంటే బ్రహ్మ విద్య మాదిరిగా ఉందన్నారు.
ప్రభుత్వ పనితీరులో ఎలాంటి గుట్టు లేదని, ఓపెన్గానే చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో 4500 కోట్ల రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టినట్టు చెప్పుకొచ్చారు. ప్రజలు తమ గ్రామాల కోసం తీర్మానం చేసిన పనులన్నీ చేస్తున్నామని గుర్తు చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తాము ఏం చేస్తాన్నామో తెలియాలంటే.. గత ప్రభుత్వానికి- కూటమి ప్రభుత్వానికి కంపేర్ చేయాలన్నారు. ఈ పల్లె పండుగ ఎందుకు చేస్తున్నామో మీకు చెబుతానని వివరించారు.
ALSO READ: కూటమిలో అప్పుడే.. మంత్రి దుర్గేష్ను నిలదీసిన టీడీపీ నేతలు, ఎందుకు?
పరిపాలన వేరు.. రాజకీయాలు వేర్వేరుగా చూడాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలున్నా, వారెప్పుడైనా ప్రజల సమస్యలపై ఈ విధంగా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. బూతులు తప్పితే సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదన్నారు. ఏపీకి చాలా బలమైన అనుభమున్న వ్యక్తుల నాయకత్వం కావాలన్నారు. సీఎం చంద్రబాబు అపారమైన పరిపాలనా అనుభవం రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగపడుతుందన్నారు.
పవన్ ఓ వైపు ప్రసంగిస్తుండగా అభిమానులు ఓజీ అంటూ నినాదాలు చేశారు.ముందు బాధ్యతని.. ఆ తర్వాతే వినోదమన్నారు. సినిమాల్లో ఎవరితోనూ పోటీపడనని స్పష్టం చేశారు. బాలకృష్ణ, చిరంజీవి, మహేష్బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లుఅర్జున్, నాని ఇలా అందరూ బాగుండాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు చేస్తున్నారు. వీరమల్లు మూవీ చిత్రీకరణ జరుగుతోంది.
వినోదం కంటే ముందు ప్రతీ ఒక్కరి కడుపు నిండాలని, అందుకే ఈ పని చేస్తున్నామని చెప్పు కొచ్చారు. ఆ తర్వాతే విందులు.. వినోదాలు.. ఓజీలని చెప్పుకొచ్చారు. మీరు సినిమాకు వెళ్లాలన్నా గోతులు లేని రోడ్లు ఉండాలి కదా అని వివరించారు. ఇండస్ట్రీలో ఏ హీరోలతో తనకు ఇబ్బంది లేదని, తానెవరితోనూ పోటీ పడనన్నారు. మీ అభిమాన హీరోలకు జై కొట్టేలా ఉండాలంటే రాష్ట్ర బాగుండాలని, దానిపై ముందు దృష్టి పెడతామని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారాయన.
రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారికి 15 రోజుల్లోపు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత న్నారు. ఒకవేళ పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రతీ ఒక్కరికీ ఉపాది కల్పించేలా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.