CBI: సీబీఐకి ఇవ్వాల్సిందే. నిందితులు, బీజేపీ డిమాండ్. సిట్ సరిపోతుంది, పక్కాగా విచారణ జరుగుతోంది. సర్కారు వాదన. అంతా విన్నాక.. మొయినాబాద్ ఫాంహౌజ్ కేసు విచారణను సీబీఐకు అప్పగించింది తెలంగాణ హైకోర్టు. సిట్ దర్యాప్తును నిలిపివేసింది. తాజాగా ఆ తీర్పు కాపీ రిలీజ్ చేసింది. అందులో సంచలన విషయాలు ఉన్నాయి.
కేసును సీబీఐకి బదిలీ చేయడానికి 45 కారణాలను హైకోర్టు ఆర్డర్ కాపీలో ప్రస్తావించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ను కూడా ఈ ఆర్డర్లో చేర్చారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పరిధి దాటి వ్యవహరించిందని.. కోర్టుకు సమర్పించాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేశారని ఆర్డర్ కాపీలో తెలిపింది.
సిట్ కేసు దర్యాప్తు సమాచారాన్ని సీఎంకు ఇవ్వడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎంకు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు ఆధారాలు కేసు సమాచారం బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదని తెలిపింది. సిట్ ఉనికిని కూడా ప్రశ్నించింది హైకోర్టు. ఆ మేరకు 26 కేసుల జడ్జిమెంట్లను కోట్ చేస్తూ ఈ తీర్పునిచ్చినట్టు హైకోర్టు వెల్లడించింది.
హైకోర్టు ఆర్డర్ అందిన వెంటనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రెడీ అవుతోంది. మెయినాబాద్ పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగానే సీబీఐ సైతం కేసు నమోదు చేయనుంది.
మరోవైపు, ఫాంహౌజ్ కేసును సీబీఐకు అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని తెలంగాణ సర్కారు ఆలోచిస్తోంది. తీర్పు కాపీని పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అవసరం అయితే సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.