UN Peacekeepers Netanyahu| లెబనాన్ లో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల్లో అయిదు మంది ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తలు (పీస్ కీపర్స్) గాయపడడంతో ఇండియాతో సహా మొత్తం 39 దేశాలు ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతున్న ఇజ్రాయెల్ సైన్యం అడ్డువచ్చిన వారిని ఉపేక్షించేది లేదని తెలిపింది. దీంతో ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచే ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు కూడా ఈ సారి ఇజ్రాయెల్ ని తప్పుబట్టాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జెనెరల్ ఆంటోనియో గెటెరస్ కు ఘాటు లేఖ రాశారు.
అక్టోబర్ 13, 2024 ఆదివారం బెంజమిన్ నెత్యన్యాహు రాసిన లేఖలో లెబనాన్ లో యుద్ధ పరిస్థితులను వివరిస్తూ.. వెంటనే లెబనాన్ నుంచి ఐరాస శాంతి కార్యకర్తలను వెనక్కు రప్పించాలని చెప్పారు. హిజ్బుల్లా మిలిటెంట్లు ఐరాస కార్యకర్తల కేంద్రాల వద్ద దాగి ఉన్నారని.. అందుకే వారిపై చేసే దాడుల్లో ఐరాస కార్యకర్తలకు ప్రాణాపాయం ఉందని అన్నారు. లెబనాన్ లో హిజ్బుల్లా మిలిటెంట్లు ఐరాస కార్యకర్తలను మానవ రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఐరాస కార్యకర్తలను దక్షిణ లెబనాన్ ను వదిలి వెళ్లిపోవాలని చెప్పినా వారు ఇజ్రాయెల్ సైన్యం హెచ్చిరికలను నిర్లక్ష్యం చేశారని.. ఐరాస కార్యకర్తలు అడ్డుతొలగకపోతే వారికే నష్టమని హెచ్చరించారు.
Also Read: ‘హిజ్బుల్లాను వీడండి లేకపోతే మీకూ గాజా గతే’.. లెబనాన్ కు నెతన్యాహు వార్నింగ్
లెబనాన్ లో 1978 నుంచి ఐరాస శాంతి కార్యకర్తులు యుద్ద పరిస్థితులను నివారించడానికి పనిచేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోరస్ ఇన్ లెబనాన్ (యునిఫిల్) లో భాగంగా పీస్ కీపర్స్ (శాంతి కార్యకర్తలు) లెబనాన్ లో మానవత్వం కోణంలో బాధితులకు సాయం చేస్తుంటారు. ఇప్పటిదాకా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 200 మంది ఐరాస కార్యకర్తలు చనిపోయారు. వారంతా కేవలం యుద్ధ బాధితులకు సాయం చేయడానికి అక్కడికి వెళ్లినవారు. యుద్ధంలో అంతర్జాతీయ చట్టాల ప్రకారం..ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాలు, శరణార్థి శిబిరాలు, మానవ హక్కుల కార్యకర్తల కేంద్రాలు, సామాన్య పౌరులపై దాడులు చేయకూడదు. కానీ ఇజ్రాయెల్ ఈ నియమాలన్నింటినీ ఉల్లంఘించడంతో ప్రపంచ దేశాలు విసిగిపోయాయి.
కేవలం అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ అనుకున్నది చేస్తోంది. అయితే తాజాగా లెబనాన్ లోనూ ఇజ్రాయెల్ ఇలాంటి చర్యలే ప్రారంభించడంతో ఇండియా సహా అన్ని దేశాలు ఇజ్రాయెల్ తీరుపై తీవ్రంగా విమర్శలు చేశాయి. ముఖ్యంగా భారతదేశం విదేశాంగ మంత్రిత్వశాఖ పశ్చిమా ఆసియాలో శాంతి భద్రతల సమస్యలను ఎత్తి చూపుతూ.. యుద్ధ సమయంలో కనీసం ఐరాస కార్యకర్తలు, వారి సేవా కార్యక్రమాలను గౌరవిస్తూ… అలాంటి నిస్వార్థ కార్యకర్తల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది.
ఇప్పటివరకు లెబనాన్ లో ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా 40 దేశాలు సంయుక్తంగా ఒక జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశాయి. బంగ్లాదేశ్, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇండియా, కొలంబియా, జర్మనీ, పెరు, గ్రీస్, ఉరుగ్వే, తదితర దేశాలు ఈ 40 దేశాల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం లెబనాన్ లో యునిఫిల్ కార్యక్రమాలు పోలండ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంతో పోలాండ్ ప్రభుత్వం ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది.
లెబనాన్ లో యునిఫిల్ తరపున మొత్తం 10,058 మంది శాంతి కార్యకర్తలున్నారు. వీరంతా 50 దేశాల నుంచి సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇక్కడికి వచ్చారు. వీరిలో ఇండియా తరపున 903 మంది లెబనాన్ వెళ్లారు.