Gita Jayanti Express coach catches fire near Madhya pradesh: దేశంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా నడుస్తున్న రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఛతర్పూర్ జిల్లా కేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇషానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 7.30 నిమిషాలకు వెళ్తున్న రైలులో మంటలు వ్యాపించాయి.
వెంటనే అప్రమత్తమైన పైలట్ రైలును నిలిపివేశారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు పరిశీలించి మంటలకు ఆర్పివేశారు. మంటల కారణంగా రైలు గంటపాటు అక్కడే ఉందని, ప్రయాణికులు కొంత ఇబ్బంది పడినట్లు స్టేషన్ మాస్టర్ ఆశిష్ యాదవ్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కురుక్షేత్ర నుంచి బయలుదేరిన గీతాజయంత్రి ఎక్స్ ప్రెస్ ఖజురహో వెళ్తుంది. ఇషానగర్ స్టేషన్కు సమీపంలో రైలులో ఒక్కసారి మంటలు వ్యాపించాయి. అయితే గీతాజయంతి ఎక్స్ ప్రెస్ డీ5 నుంచి దట్టమైన పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమైంది. దీంతో వెంటనే రైలును నిలిపివేశారు. తర్వాత అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులో తీసుకొచ్చారు.
రైలు కిందిభాగంలో రబ్బర్ వేడక్కడంతోనే రాపిడి కారణంగా మంటలు వ్యాపించాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయలు కలగలేదని అధికారులు తెలిపారు. అలాగే డీ5 కోచ్కు సైతం ఎలాంటి నష్టం కలగలేదని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, రైలు ప్రమాదాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్లోని రూర్కీ సమీపంలోని రైల్వే ట్రాక్లపై ఎల్పీజీ సిలిండర్ కనిపించింది. సిలిండర్ను గూడ్స్ రైలు లోకో పైలట్ గుర్తించి అధికారులను అప్రమత్తం చేయడంతో రైలు పట్టాలు తప్పకుండా ఆపాడు. అనంతరం సంఘటనా స్థలానికి ఒక పాయింట్మెన్ను పంపించగా.. సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు.
Also Read: రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం.. ఎందుకురా ఇలా తయ్యారయ్యారు!
ధంధేరా, లాండౌరా స్టేషన్ల మధ్య ఉదయం 6.35 నిమిషాలకు గూడ్స్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రాక్పై సిలిండర్ను గుర్తించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ఖాళీ సిలిండర్గా గుర్తించారు. అయితే ఆగస్టు నుంచి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 18 ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతుంది.