Delhi-Kashmir Vande Bharat Sleeper: వందే భారత్ రైళ్లు భారతీయ రైల్వే వ్యవస్థను కీలక మలుపు తిప్పాయి. విమానం లాంటి సౌకర్యాలు, అత్యంత వేగం కారణంగా చాలా మంది ప్రయాణీకులు ఈ రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు రకాల వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, జనవరి 2025 నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఎక్కువ దూరం, రాత్రిపూట ప్రయాణాల కోసం ఈ రైలును రూపొందించారు. దేశంలోని పలు కీలక మార్గాల్లో ఈ రైళ్లను నడిపించేందుకు రైల్వే అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
న్యూఢిల్లీ-కాశ్మీర్ రూట్ లో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్
తాజా సమాచారం ప్రకారం రైల్వే అధికారులు న్యూఢిల్లీ – జమ్మూ కాశ్మీర్ మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు దేశ రాజధానితో జమ్మూ కాశ్మీర్ రాజధాని మధ్య కనెక్టివిటీ పెరగనుంది. మున్ముందు ఈ మార్గాన్ని బారాముల్లా వరకు పొడిగించాలని ఆలోచిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. త్వరలో ప్రారంభం అయ్యే ఈ రైలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో బయల్దేరి శ్రీనగర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించనుంది. ఈ రైలు నిర్వహణ బాధ్యతలను నార్త్ రైల్వే జోన్ చూసుకోనుంది. “ఈ రైలు దేశ రాజధానితో పాటు భూలోక స్వర్గం కాశ్మీర్ ను కలుపుతుంది. మున్ముందు ఈ ప్రయాణం బారాముల్లా వరకు పొడగించే అవకాశం ఉంది” అంటున్నారు రైల్వే సీనియర్ అధికారులు.
13 గంటల్లో 800 కి.మీ ప్రయాణం
న్యూ ఢిల్లీ- శ్రీనగర్ మధ్య దూరం 800 కిలో మీటర్లు ఉంటుంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ దూరాన్ని కేవలం 13 గంటల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ లో ఉన్న రైళ్లతో పోల్చితే ఇది అత్యంత వేగంగా ప్రయాణించే రైలు అంటున్నారు అధికారులు.
న్యూఢిల్లీ-శ్రీనగర్ వందే భారత్ స్లీపర్ రైలు షెడ్యూల్, స్టాప్లు
ఈ రైలు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 19:00 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ అంబాలా కాంట్ జంక్షన్, లూథియానా జంక్షన్, కథువా, జమ్ము తావి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, సంగల్దాన్, బనిహాల్తో సహా పలు కీలక స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ-శ్రీనగర్ వందే భారత్ స్లీపర్ రైలు టిక్కెట్ ధర ఎంత అంటే?
న్యూఢిల్లీ-శ్రీనగర్ వందే భారత్ స్లీపర్లో ప్రయాణీకులు మూడు రకాల స్పెసిలిటీస్ పొందే అవకాశం ఉంటుంది. ఒక్కో దానికి ఒక్కో రకమైన ధరను అధికారులు నిర్ణయించారు. AC 3 టైర్ (3A), AC 2 టైర్ (2A), AC ఫస్ట్ క్లాస్ (1A) గా మూడు భాగాలు ఉంటారు. 3Aకి సుమారుగా రూ. 2,000, 2Aకి రూ. 2,500, 1Aకి రూ. 3,000 వరకు టికెట్ ధరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఫైనల్ రేట్లు కాస్త అటు ఇటుగా ఉండవచ్చు.
Read Also: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!