Anam: 175కి 175. జగన్ టార్గెట్ ఇది. కుప్పంతో సహా ఏపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామంటూ సవాల్ చేస్తున్నారు. గడప గడపకు ఎమ్మెల్యేలను పంపిస్తూ.. వారిని ప్రజలకు చేరువ చేస్తున్నారు. పనితీరు సరిగా లేని నేతలకు వార్నింగులు ఇస్తున్నారు. ప్రజలకు అద్భుతమైన పాలన అందిస్తున్నామని.. సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తాయని సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. అయితే, ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం జగన్ ఇమేజ్ ను ఫుల్ గా డ్యామేజ్ చేసిపడేశారు. పబ్లిక్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీని, జగన్ ను ఇరకాటంలో పడేశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే…
ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు లేవు. నాలుగేళ్లలో ఏం పని చేశామని ప్రజలను ఓట్లు అడుగుతాం. ప్రాజెక్టులు కట్టమా? పనులు మొదలుపెట్టామా? పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? అలా అయితే గత ప్రభుత్వమూ ఇచ్చింది. ఇల్లు కడతామని లేఅవుట్ వేసినా ఇప్పటికీ కట్టలేదు’’ అని ప్రభుత్వం తీరుపై ఆనం మండిపడ్డారు. నెల్లూరు జిల్లా రాపూరులో కొత్తగా నియమించిన సచివాలయ వైసీపీ కన్వీనర్లు, వాలంటీర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎస్ఎస్ కెనాల్ గురించి సీఎం జగన్కు ఎన్నోసార్లు చెప్పాం. అసెంబ్లీలోనూ ప్రస్తావించాం. అయినా పనులు జరగడం లేదు. కంటి ముందు నీళ్లున్నాయని సంతోషపడటమే తప్ప నీళ్లు తాగలేని పరిస్థితి. కండలేరు దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయాం. ప్రజలు నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరు. అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నాం. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం’’ అంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనం కామెంట్లు రాజకీయంగా రచ్చ రాజేస్తున్నాయి. అధికారపార్టీ ఎమ్మెల్యేనే ఇలా ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించడం కలకలం రేపుతున్నాయి. ఓవైపు సీఎం జగనేమో మనది బెస్ట్ గవర్నమెంట్ అని.. ఈసారి 175కి 175 అంటున్నారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేనేమో నాలుగేళ్లలో ఏ పనులూ చేయలేదని.. ఓట్లెలా అడుగుతామని అన్నారు. ఆనం వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారనుండటంతో.. ఆయనపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, రామనారాయణరెడ్డి త్వరలోనే వైసీపీని వీడి టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుండగా.. ఇలాంటి సమయంలో అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ ఎత్తుగడగా అనుమానిస్తున్నారు. మరి, జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో?