Lokesh: యువగళం. నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్ర. జనవరి 27న ముహూర్తం. 400 రోజులు. 4000 కిలోమీటర్లు. ఎన్నికల వరకు ప్రజల్లోనే. అంతా బాగుంది. ప్రణాళిక పక్కాగా ఉంది. టీడీపీలో కొత్త ఉత్సాహం ఖాయం. గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్ ల పాదయాత్రలు ఫుల్ సక్సెస్ అయ్యాయి. యాత్రల తర్వాత ఆ ముగ్గురూ అధికారంలోకి వచ్చారు. అదే సక్సెస్ ఫార్ములాను ఫాలో కాబోతున్నారు లోకేశ్. పాదయాత్రతో పవర్ లోకి వచ్చి తీరాలనేది ఎయిమ్.
ఇదంతా సరే. కానీ, అప్పటి రాజకీయాలు వేరు. ఇప్పటి జగన్ మార్క్ పాలిటిక్స్ వేరు. గతంలో మాదిరి సాఫీగా పాదయాత్ర జరిగే పరిస్థితులు ఇప్పుడు లేవంటున్నారు. జగన్ ది అంతా కడప స్టైల్ అనేది టీడీపీ విమర్శే. నందిగామలో చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనే అందుకు ఎగ్జాంపుల్. కర్నూలులో సైతం బాబుకు ఇబ్బందులు క్రియేట్ చేశారు. చంద్రబాబునే టార్గెట్ చేసిన ఘనులు.. నారా లోకేశ్ పాదయాత్ర చేస్తానంటే.. ఆ చెయ్యండి చినబాబు అంటూ స్వాగతిస్తారా? అనే అనుమానం లేకపోలేదు. రెచ్చగొట్టే చర్యలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.
ఇటీవలి మాచర్ల ఘటనే తీసుకుంటే.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. అంటూ టీడీపీ శ్రేణులు ర్యాలీ తీస్తున్నారు. కాపు కాసి మరీ ఆ ర్యాలీపై వైసీపీ వర్గీయులు రాళ్లు వేశారు. అది ఘర్షణగా మారి.. విధ్వంసానికి దారి తీసింది. మాచర్ల రణరంగంగా మారింది. ఇలాంటి చేదు ఘటనలు అనేకం. గతంలోనూ పలుమార్లు లోకేశ్ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసులు పెట్టారు. ఎన్ని కేసులు ఉంటే అంత గొప్ప అన్నట్టు లోకేశ్ సైతం అందుకు ప్రిపేర్ గా ఉన్నారు. రండి చూసుకుందాం.. తేల్చుకుందాం.. అంటూ తొడగొడుతున్నారు.
లోకేశ్ పంతం.. వైసీపీ వైరం.. ఎక్కడికి దారి తీస్తుందోననే టెన్షన్ లేకపోలేదు. ఇప్పటికే ఏపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. కావాలనే కవ్వించే బ్యాచ్ లు ఎక్కువయ్యాయి. అధికార పార్టీ దూకుడు.. టీడీపీ ఎదురుదాడులతో రాజకీయం కాక మీదుంది. ఇలాంటి సమయంలో.. నారా లోకేశ్.. యువగళం.. వినిపించేందుకు సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధం కావడంతో మరింత సెగ రాజుకుంది.
మరోవైపు, జనసేనాని నేనుసైతం అంటూ వారాహి పై యుద్ధానికి వస్తున్నారు. ఆయన బస్సు టూర్.. ఈయన నడక టూర్.. ఆ ఇద్దరూ రెండు వైపుల నుంచి జగన్ ను చుట్టుముడితే? ఇప్పటికే వారాహి యాత్రను అడ్డుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. పవన్ నే ఆపాలని చూస్తుంటే.. నారా లోకేశ్ ను మాత్రం పాదయాత్ర చేయనిస్తారా? అనే డౌట్. వారాహికి బ్రేకులు వేస్తే.. పవన్ లోని మరో యాంగిల్ బయటకు రావడం ఖాయం. లోకేశ్ గళాన్ని ఆపాలని చూస్తే.. తెలుగు తమ్ముళ్లంతా ఒక్కటవ్వడం గ్యారంటీ. ఎందుకొచ్చిన గొడవ.. యాత్రలను అడ్డుకుని వారికి మరింత ప్రచారం కల్పించడం ఎందుకని.. వైసీపీ వదిలేస్తుందా? లేదంటే, కవ్వింపు చర్యలు.. కౌంటర్ అటాక్స్ తో ఏపీలో రచ్చ రాజుకుంటుందా?