రాజ్యాంగ విరుద్ధం
– పట్నం మహేందర్ రెడ్డికి పదవి ఎలా ఇస్తారు?
– అనర్హత వేటు వేయకుండా పదవులా?
– రేవంత్ హయాంలో రాజ్యాంగం ఖూనీ
– పీఏసీ చైర్మన్ విషయంలోనూ ఇదే తంతు
– ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు
హైదరాబాద్, స్వేచ్ఛ : తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు హాజరయ్యారు. మధుసూదనాచారికి కేటీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని చెప్పారు మధుసూదనాచారి.
అనర్హత వేయకుండా పదవిస్తారా…
మరోవైపు, చీఫ్ విప్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీని నియమించడం కరెక్ట్ కాదంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా పట్నం మహేందర్ రెడ్డికి పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా, ఆయన్ను చీఫ్ విప్గా ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
రాజ్యాంగ ఉల్లంఘన …
పట్నం అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛైర్మన్ దగ్గర పెండింగ్లో ఉందన్న హరీష్ రావు, రేవంత్ హయాంలో రాజ్యాంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణగా పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారని గుర్తు చేశారు. పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : మీకు ప్రతిదీ రాజకీయమేనా… హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్న