ప్రతిదీ రాజకీయమేనా ?
– రాజ్యాంగం ప్రకారమే నియామకాలు
– ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం తగదు
– బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతల్ని ఎందుకు చేర్చుకున్నారు?
– వ్యవస్థల్ని రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదు
– హరీష్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
హైదరాబాద్, స్వేచ్ఛ : మండలిలో ప్రతిపక్ష నేతగా ఎంపికైన మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు మంత్రి. ఈ సందర్భంగా హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించారు. ప్రతిదాన్ని రాజకీయం చేయటం హారీష్ రావుకు అలవాటుగా మారిందన్నారు. ఆయన వ్యవస్థలను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఫైరయ్యారు.
అప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా ?
రాజ్యాంగానికి లోబడే పట్నం మహేందర్ రెడ్డిని మండలి చీఫ్ విప్గా నియమించినట్టు స్పష్టం చేశారు. హరీష్ రావు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో హరీష్ రావుకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. పీఏసీ ఛైర్మన్ పదవిని సంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికే ఇచ్చామని, ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం కోర్టు పరిధిలో ఉందని గుర్తు చేశారు శ్రీధర్ బాబు.
అంతా బురదజల్లె కార్యక్రమం…
ఏ నియామకం జరిగినా రాజ్యాంగ బద్ధంగానే ఉంటుందన్నారు. రాజకీయంగా ఏదైనా బురదజల్లే కార్యక్రమం చేయాలంటే వ్యవస్థలను ఉపయోగించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా రాజ్యాంగ ఉల్లంఘన జరగడం లేదని స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్, చీఫ్ విప్ నియామకాలు రాజ్యాంగం ప్రకారమే జరిగాయని చెప్పారు మంత్రి.
also read : రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం.. ఎందుకురా ఇలా తయ్యారయ్యారు!