Warngal : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా వార్ ఓ రేంజ్లో జరుగుతోంది. ఫోటోతో మొదలైన వివాదం, తర్వాత ఫ్లెక్సీల చింపివేత, ధర్నాలు, దాడులు, అరెస్టుల దాకా వెళ్లింది. దీంతో మంత్రి రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో ఏ క్షణం ఏం జరుగుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడంతో వార్
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కీలకంగా ఉన్నారు కొండా సురేఖ, రేవూరి ప్రకాష్ రెడ్డి. 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి సురేఖ గెలుపొందగా, పక్కనే ఉన్న పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి గెలిచారు. ఇద్దరూ కాంగ్రెస్ నుంచే పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా వీరిద్దరి మధ్య కొత్త పంచాయితీ నెలకొంది. పరకాల నియోజకవర్గంలో ఇరువురి నేతలకు చెందిన వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. బతుకమ్మ, దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ ఫ్లెక్సీలను చింపివేశారు.
ఘర్షణకు దారి తీసిన ఫ్లెక్సీ వివాదం
ఫ్లెక్సీ వివాదం మరింత ముదిరి ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు గాయపడ్డారు. దీంతో కొందరు కొండా వర్గీయులను గీసుగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు కేసు పెట్టిన ఎమ్మెల్యే తమ వాళ్లను చిత్రహింసలు పెడుతున్నారని, ధర్మారం రైల్వే గేట్ వద్ద కొండా వర్గీయులు ధర్నా చేశారు. వరంగల్ – నర్సంపేట ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. పోలీసులు వారికి సర్దిచెప్పారు. సీఐ మహేందర్ సమస్య పరిష్కార హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇటు గాయపడ్డ తన అనుచరులను కలిసి పరామర్శించారు ఎమ్మెల్యే.
పోలీస్ స్టేషన్కు మంత్రి.. సీఐ కుర్చీలో..!
ఫ్లెక్సీ వార్తో ఉమ్మడి వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మంత్రి కొండా సురేఖ గీసుగొండ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కూడా చేరుకున్నారు. తన వర్గీయులపై పెట్టిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు సురేఖ. అయితే, సీఐ కుర్చీలో ఆమె కూర్చోవడంపై మరో వివాదానికి ఆస్కారమిచ్చినట్టయింది. వెంటనే తమ వారిని విడిచిపెట్టాలని సురేఖ కోరారు. అదే సమయంలో ఆమె వర్గీయులు అక్కడకు భారీగా చేరుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ALSO READ : అలయ్ బలయ్’లో రగడ… కేంద్ర మంత్రి Vs రాష్ట్ర మంత్రి